మారిన వ్యూహం: చేవెళ్ల నుంచే జైపాల్ రెడ్డి పరిమితం
హైదరాబాద్: విలీనానికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అంగీకరించకపోవడంతో తెలంగాణలో ఎన్నికలను ఎదుర్కునే వ్యూహాన్ని కాంగ్రెసు అధిష్టానం మార్చుకుంది. దీంతో ఎస్ జైపాల్ రెడ్డి శాసనసభకు పోటీ చేయాలనే ఆలోచనను విరమించుకుని చేవెళ్ల లోకసభ స్థానం నుంచే పోటీ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
మంగళవారం సాయంత్రం వరకు జైపాల్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీకి పోటీ చేయాలని అనుకున్నారంటూ జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి శాసనసభా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ముందు ఆయన అనుకున్నారు. కానీ, తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్యను, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించడంతో ఆయన ఆ ఆలోచననుంచి వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు.
జైపాల్ రెడ్డి వంటి పెద్ద నాయకులకు 2014 ఎన్నికల్లో పార్టీని నడిపించే బాధ్యతను అప్పగించడానికి అధిష్టానం నిర్ణయించుకుందని, అందుకే పార్టీ పదవుల నుంచి వారిని దూరంగా ఉంచిందని అంటున్నారు. జైపాల్ రెడ్డి 1974, 1983 మధ్య కాలంలో కల్వకుర్తి నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత ఢిల్లీ రాజకీయాలకు వెళ్లారు.
చేవెళ్ల నియోజకవర్గం నుంచి విజయం సాధించడం జైపాల్ రెడ్డికి అంత సులభం కాదని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తెలంగాణ సెంటిమెంట్తో పోటీకి దిగనుండగా, వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు సీమాంధ్ర ఓటర్లపై ఆధారపడి రంగంలోకి దిగుతున్నాయి. అయితే, జైపాల్ రెడ్డికి విజయం సులభంగానే అందుతుందని కాంగ్రెసు నాయకులు అంటున్నారు. ఇదే అబిప్రాయాన్ని ఎమ్మెల్సీ యాదవ రెడ్డి టైమ్స్ ఆప్ ఇండియాతో చెప్పారు. తెలంగాణ, సీమాంధ్ర నుంచి పోటీ చేసే లోకసభ అభ్యర్థుల జాబితాను కాంగ్రెసు అధిష్టానం చివరలో విడుదల చేయవచ్చునని భావిస్తున్నారు.