పవన్ రిక్వెస్ట్ మన్నించిన వైసీపీ మాజీ మంత్రి- సొంత పార్టీ నేతల ఫైర్-కుట్రేనన్న బాలినేని
ఏపీలో అధికార వైసీపీకీ విపక్షాలకు మధ్య జరుగుతున్న పొలిటికల్ వార్ లో జనసేనాని పవన్ కళ్యాణ్ పాత్ర ఎప్పుడూ కీలకంగా కనిపిస్తుంటుంది. అందుకే సీఎం జగన్ సైతం ఆయన్ను చంద్రబాబు దత్తపుత్రుడిగా అభివర్ణిస్తుంటారు. దీంతో జనసేన నేతలు కూడా జగన్ ను సీబీఐ దత్తపుత్రుడిగా కౌంటర్లు ఇస్తుంటారు. ఇరు పార్టీల మధ్య ఈ స్ధాయిలో మాటలయుద్దం సాగుతున్న తరుణంలో వైసీపీకి చెందిన మాజీ మంత్రి ఒకరు పవన్ కళ్యాణ్ చేసిన విజ్ఞప్తికి స్పందించి జనసేన నేతలపై కేసులు ఉపసంహరిచుకునేలా ఆదేశాలు ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

ప్రకాశం జనసేన నేతలపై కేసులు
ప్రకాశం జిల్లాలో వైసీపీకీ, జనసేనకూ మధ్య సాగుతున్న వార్ లో భాగంగా తాజాగా పలువురు జనసేన నేతలపై పోలీసులు కేసులు పెట్టారు. జనసేనకు చెందిన ఓ మహిళా నేతను అర్ధరాత్రి పోన్ చేసి వైసీపీ నేతలు బెదిరించారు. దీనిపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. దీంతో ఇరుపార్టీల మధ్య మాటల యుద్ధం సాగింది. ప్రకాశం జిల్లాలో తమ కార్యకర్తల్ని భయపెట్టాలని చూస్తే తాను ఊరుబోబోనని పవన్ కూడా హెచ్చరికలు జారీ చేశారు. అలాగే జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపైనా పవన్ విమర్శలు చేశారు.

పవన్ విజ్ఢప్తితో కేసుల ఉపసంహరణ
అయితే ఆ తర్వాత ఏం జరిగిందో కానీ పవన్ కళ్యాణ్ బాలినేని శ్రీనివాసరెడ్డికి ఫోన్ చేసి జనసేన నేతలపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని కోరినట్లు తెలుస్తోంది. దీనికి స్పందించిన బాలినేని.. జనసేన నేతలపై పెట్టిన కేసుల్ని వెనక్కి తీసుకునేలా జోక్యం చేసుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత పోలీసులు కేసులు ఉపసంహరించుకున్నారు. దీంతో ఈ వివాదం మరో మలుపు తిరిగింది. తమ ప్రత్యర్ధి పార్టీ జనసేన నేతలపై పోలీసులు పెట్టిన కేసుల్ని వెనక్కి తీసుకోవడానికి ఆదేశాలు ఇచ్చిన బాలినేనిపై ఫైర్ అవుతున్నారు.

వైసీపీ నేతలు తనపై కుట్ర చేస్తున్నారన్న బాలినేని
ప్రకాశం జిల్లాలో జనసేన నేతలపై కేసుల ఉపసంహరణ వ్యవహారంపై తనపై సొంత పార్టీ నేతలు చేస్తున్న విమర్శలపై బాలినేని స్పందించారు. తనపై సొంత పార్టీ నేతలే కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వ్యక్తిగతంగా తనను టార్గెట్ చేస్తున్నారన్నారు. తనను ఎవరు టార్గెట్ చేస్తున్నారో తెలుసని.. వాళ్ల సంగతి చూస్తానని హెచ్చరించారు. తనపై ఆరోపణలు చేస్తున్నవారితో టీడీపీ నేతలు టచ్లో ఉన్నారని ఆరోపించారు.

రాజీనామాకు సిద్ధమన్న బాలినేని
ప్రకాశం జిల్లాలో జనసేన నేతలపై కేసుల ఉపసంహరణ వ్యవహారంలో తనపై ఆరోపణలు చేస్తున్న సొంత పార్టీ నేత తీరుపై బాలినేని ఆవేదన వ్యక్తం చేశారు. తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బాలినేని సవాల్ విసిరారు. అలాగే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని కూడా స్పష్టం చేశారు. ఇప్పటికే మంత్రి పదవి కోల్పోయిన తర్పాత మౌనంగా ఉంటున్న బాలినేనిని వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇందులో సొంత పార్టీ నేతల హస్తం ఉండటంతో ఆయన మరింతగా ఫీలవుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications