శంషాబాద్ వద్ద యువతి అపహరణ యత్నం: క్యాబ్ డ్రైవర్లేనా?
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో ఉద్యోగానికి వచ్చిన ఓ యువతి అపహరణకు గురైనట్లుగా తెలుస్తోంది. క్యాబ్లో తాను ఇంటికి తిరిగి వెళ్తుండగా డ్రైవర్లు అపహరించినట్లు ఆమె విమానాశ్రయంలో తనను ఇంటర్వ్యూ చేసిన కంపెనీ ప్రతినిధులకు ఫోనులో చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ యువతిని క్యాబ్ డ్రైవర్ ఔటర్ రింగ్ రోడ్డుపై వదిలి వెళ్లిపోయాడు.
ఇద్దరు చిన్నారులతో తల్లి ఆత్మహత్య
హైదరాబాద్ నగరంలోని ఆసిఫ్నగర్ జిర్రా ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులతో సహా ఆత్మహత్య చేసుకుంది. ఇంటి ముందు ఉన్న సంపులో చిన్నారులను పడేసి తల్లి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు స్థానికులు భావిస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
అర్ధరాత్రి వేళ ఇళ్లలో ప్రవేశించి దోపిడీలకు పాల్పడటమే కాకుండా, అడ్డొస్తే హత్యలు చేసేందుకు కూడా వెనుకాడని అంతరాష్ట్ర దొంగల ముఠాలో ఏడుగురిని నేటి మధ్యాహ్నం అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వారి నుంచి రూ.2.13 లక్షల నగదును, ఐదు వేట కొడవళ్లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఇటీవలి కాలంలో దొంగతనాలు పెరిగిపోయిన నేపథ్యంలో, దొంగల ఆగడాలను అరికట్టించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్టు వివరించారు.
'ఇసుక మాఫియాపై ఉక్కుపాదం'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో ఇసుక మాఫియా పేరు వినబడకుండా చేస్తామని కమిషనర్ ఆఫ్ పోలీస్ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు.
ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపనున్నట్టు ప్రకటించారు. ఇసుకకు సంబంధించిన బిల్లులు సరిగా లేకపోతే లారీ సీజ్ చేస్తామన్నారు. ఆపై సదరు వాహన యజమానిపైనా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతేకాకుండా క్వారీల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర నిఘా ఉంచుతామన్నారు.