ప్రజలు తరుముతుంటే కాల్వలో పడి దొంగ దుర్మరణం, ఆస్తికోసం తల్లీకూతుళ్లపై దాడి
నెల్లూరు: దొంగతనం చేసేందుకు వచ్చి స్ధానికులు తరమడంతో ఓ దొంగ కాల్వలో పడి మృతి చెందాడు. ఈ సంఘటన నగరంలోని పప్పుల వీధిలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. దొంగతనం చేసేందుకు వచ్చిన దొంగను స్ధానికులు పట్టుకునేందుకు యత్నించారు.
స్ధానికులు అతడిని పట్టుకునేందుకు తరమడంతో పారిపోతున్న క్రమంలో దొంగ ప్రమాదవశాత్తూ కాల్వలో పడి దుర్మరణం పాలయ్యాడు. వెంటనే ఈ సమాచారాన్ని స్ధానికులు పోలీసులకు తెలియజేశారు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
తల్లీ కూతుళ్లపై దాడి:
గుర్తు తెలియని కొందరు దుండగులు తల్లీకూతుళ్లపై దాడి చేసిన సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని చేజర్ల మండలం మాముడూరు గ్రామానికి చెందిన లలితమ్మ, వరమ్మలపై కర్నులూకు చెందిన ఐదుగురు దుండుగులు మారణాయుధాలతో దాడి చేశారు.
ఆస్తి తగాదలే ఇందుకు కారణమని తెలుస్తోంది. అంతేకాదు లలితమ్మ భర్త తమిళనాడులో ఐఏఎస్ అధికారి అని సమాచారం. ఆ అధికారికి లలితమ్మ రెండో భార్య. దుండగుల్లో ఇద్దరిని పట్టుకున్న స్ధానికులు పోలీసులకు అప్పగించారు.
దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఆస్తి కోసమే తల్లీకూతుళ్లపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తల్లీకూతుళ్లను నెల్లూరులోని ఆసుపత్రికి తరలించారు. వైద్య చికిత్సను చేసిన డాక్టర్లు వారి పరిస్ధితి విషమంగా ఉందని చెప్పారు.