ఏపీలో.. వర్క్ ఫ్రమ్ హోమ్, లోకేశ్ కోరికపై.. పైలట్ ప్రాజెక్టుకు ‘ఫస్ట్ అమెరికన్’ ఓకే!
అమరావతి: రాష్ట్రంలోని ఫైబర్గ్రిడ్ ప్రాజెక్టును ఉపయోగించుకుని కొన్ని గ్రామాల్లో 'వర్క్ ఫ్రమ్ హోమ్' పైలట్ ప్రాజెక్టును అమలుచేసేందుకు 'ఫస్ట్ అమెరికన్' కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసింది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.
గురువారం శాన్ఫ్రాన్సిస్కోలో లోకేశ్ పర్యటించారు. పలు కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. తన పర్యటనలో భాగంగా లోకేశ్ 'ఫస్ట్ అమెరికన్' పైనాన్షియల్ కార్పొరేషన్ కంపెనీ సీఈవో డెన్నిస్ జె గిల్మోరె, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ కెన్నెత్ డి డిజియోర్జియో, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మార్క్ ఇ సీటన్లతో సమావేశమయ్యారు.
ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు చేపట్టిన ‘ఫస్ట్ అమెరికన్'
‘ఫస్ట్ అమెరికన్' కంపెనీ.. టైటిల్, బీమా సర్వీసులు, మార్టిగేజ్ హోమ్ వారంటీ సర్వీసులను అందిస్తోంది. తమ రాష్ట్రంలో భూ రికార్డులన్నీ డిజిటలైజ్ చేస్తున్నామని, ట్యాంపరింగ్ చేసే అవకాశం లేకుండా ల్యాండ్ రికార్డులు అన్నీ బ్లాక్చైన్ టెక్నాలజీ వేదికపైకి తీసుకొస్తున్నామని లోకేశ్ వివరించారు. దీనివల్ల రైతులు తక్కువ సమయంలో టైటిల్ ఇన్సూరెన్స్, రుణాలు పొందే వీలు కలిగిందన్నారు. ఫైబర్గ్రిడ్ సేవల గురించీ చెప్పారు. ఫస్ట్ అమెరికన్ కంపెనీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ల్యాండ్ రికార్డులను డిజిటలైజ్ చేసే పైలట్ ప్రాజెక్ట్ను చేస్తోందని, దీనిలో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు.
ఫైబర్గ్రిడ్ సాయంతో వర్క్ ఫ్రమ్ హోమ్...
ఫైబర్గ్రిడ్ను ఉపయోగించుకుని గ్రామాల్లో యువతీ, యువకులు వారి ఇంటి నుంచే పని చేసుకునేలా ఒక మోడల్ పైలట్ ప్రాజెక్టు చేయాలని లోకేశ్ కోరగా ఇందుకు ఆ కంపెనీ సీఈవో డెన్నిస్ జె గిల్మోరె అంగీకరించారు. త్వరలోనే తాము ఆంధ్రప్రదేశ్కు వస్తామని, అక్కడ జరుగుతున్న అభివృద్ధిని స్వయంగా చూస్తామని చెప్పారు. మరోవైపు కోవలెంట్ వెంచర్స్ సీఈవో రామ్ యలమంచిలి, జనరల్ క్యాటలిస్ట్ కంపెనీ ఎండీ హేమంత్ తనేజాలతోనూ లోకేశ్ చర్చించారు. ఆయన విజ్ఞప్తి మేరకు ఏపీతో కలిసి పని చేసేందుకు వారు కూడా సుముఖత వ్యక్తం చేశారు.
నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో ‘తానా' వంతు...
అనంతరం స్టాన్ఫోర్డ్ బిజినెస్ స్కూల్ డీన్ జొనాతన్ లెవిన్తోనూ లోకేశ్ భేటీ అయ్యారు. లోకేశ్ సియాటెల్లో ఉన్నప్పుడు ‘తానా' అధ్యక్షుడు సతీశ్ వేమన ఆయన్ని కలిశారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో తానా తరఫున తమ వంతు బాధ్యతను నిర్వహిస్తామని ఈ సందర్భగా సతీశ్ చెప్పారు. ఆ తరువాత సిలికాన్ ఆంధ్రా విశ్వవిద్యాలయ ప్రథమ వార్షికోత్సవలో లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలు మర్చిపోతే గుర్తింపు, భవిష్యత్తు ఉండవన్నారు.
భారతీయులే మర్చిపోతున్నారు...
అమెరికా వచ్చిన వారు మన భాష, సంస్కృతి, సంప్రదాయాలు మర్చిపోయి ఉంటారని తాను భావించానని, కానీ ఇక్కడికి వచ్చిన వారు అవన్నీ గుర్తుపెట్టుకుంటున్నారని, భారత్ ఉన్న వారికే వాటి విలువ తెలియడం లేదని లోకేశ్ వ్యాఖ్యానించారు. కూచిపూడి నృత్యాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్లో కూచిపూడి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని, దీనికి సిలికాన్ ఆంధ్రా సహకరించాలని లోకేశ్ కోరారు.