మంత్రి లోకేష్కు అరుదైన ఆహ్వానం:చైనాలో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు ఇన్విటేషన్
అమరావతి: మంత్రి నారా లోకేష్కు అరుదైన ఆహ్వానం అందింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం న్యూ ఛాంపియన్స్ వార్షిక సమావేశాలకు హాజరు కావాలని మంత్రి లోకేష్ను ఆ ఫోరం ప్రతినిధులు ఆహ్వానించారు.
ఈ సమావేశాలు చైనాలో సెప్టెంబర్ 18 నుండి 20 వరకు జరగనున్నాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం న్యూ ఛాంపియన్స్ వార్షిక సమావేశాల్లో పాల్గొని ప్రసంగించాల్సిందిగా మంత్రి లోకేష్ను ఫోరం ప్రతినిధులు ఆహ్వానించారని, ఈమేరకు లోకేష్ కు ఇప్పటికే ఇన్విటేషన్ అందినట్లు తెలిసింది. దీంతో మంత్రి లోకేష్ సెప్టెంబర్ 17 నుంచి 22 వరకు చైనా పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు.
కాగా మొత్తం మన దేశం మొత్తం మీద ఇద్దరు మంత్రులకు మాత్రమే ఈ ఆహ్వానం అందగా అందులో ఒకరైన లోకేష్ కు భారతదేశం తరపున మాట్లాడే అవకాశం లభించడం గమనార్హం. మొత్తం మూడు రోజులపాటు జరిగే 11ఆర్థికపరమైన సమావేశాల్లో లోకేష్ పాల్గొని ప్రసంగించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను ఆ సందర్భాన్ని పురస్కరించుకొని లోకేష్ వివరించనున్నారు.

ఈ ఐదురోజుల చైనా పర్యటనలో లోకేష్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో పాల్గొనడంతో పాటు...పలు ఎలక్ట్రానిక్ కంపెనీల ప్రతినిధులను కలవనున్నారని తెలిసింది. అంతేకాకుండా కొన్ని మన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలతో ఒప్పందాలు కూడా చేసుకోనున్నరని సమాచారం.
ఈ ఏడాది ఆరంభంలో దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పాల్గొనే అవకాశం సిఎం చంద్రబాబుకు లభించగా తాజా ఈ అవకాశం లోకేష్ ను వరించడం గమనార్హం. 2018 జనవరిలో దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పాల్గొన్న సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఆ సమావేశాలకు లోకేష్ కూడా సందర్శకుడిగా హాజరయ్యారు. అయితే అవే సమావేశాల్లో ప్రధాని మోడీ కూడా పాల్గొనడం విశేషం.
ఆ సందర్భంలో సిఎం చంద్రబాబు మాట్లాడుతూ ఈ సమావేశాల్లో పాల్గొనడం ద్వారా మన దేశానికి ఎన్నో లాభాలు ఉన్నాయన్నారు. అలాగే రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై ఈ సమావేశంలో వివరించామని చెప్పారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పాల్గొనడం ద్వారా వివిధ దేశాల ప్రతినిధులతో అభిప్రాయాలు పంచుకునే అవకాశం వచ్చిందని ఏపీ మంత్రి లోకేష్ చెప్పారు.












Click it and Unblock the Notifications