హైదరాబాద్ వద్దు, ఆంధ్రాబ్యాంక్ కూడా: యలమంచిలి
హైదరాబాద్: విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాదు నుండి పాలన కొనసాగించడం సరికాదని మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ బుధవారం అన్నారు. ఏపీ నుండే పాలన సాగాలన్నారు. ఆంధ్రాబ్యాంకు ప్రధాన కార్యాలయం హైదరాబాదులో ఉండటంలో అర్థం లేదని, దీనిని కూడా మచిలీపట్నానికి మార్చాలన్నారు.
ఎరువుల కోసం రైతులు ఆందోళన చెందవద్దు : ప్రతిపాటి
ఎరువుల కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి పతిపాటి పుల్లారావు అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ వచ్చే రెండు నెలలపాటు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రానికి మరో 1.17 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల కొరత ఉందన్నారు.

2.5 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు కేటాయించాలని కేంద్రానికి లేఖ రాస్తామని మంత్రి చెప్పారు. కేంద్రమంత్రిని స్వయంగా కలిసి దీనిపై విజ్ఞప్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. రుణమాఫీపై ఆర్బీఐ నుంచి ఎలాంటి స్పష్టత లేదని, ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీకి కట్టుబడి ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. సాంకేతిక సమాచారం అందించేందుకే రైతులకు ఐప్యాడ్లు కేటాయిస్తామన్నారు. నాబార్డ్ సాయంతో గోదాములను నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు.
హైకోర్టు కోసం ఆందోళన ఉధృతం: లాయర్ల జేఏసీ
తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు కావాలని డిమాండ్ చేస్తూ గురువారం నుంచి నిరసన ప్రదర్శనలు, కోర్టుల బహిష్కరణవంటి కార్యక్రమాలతో ఆందోళనలను ఉధృతం చేస్తామని తెలంగాణ అడ్వొకేట్ జేఏసీ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. ప్రభుత్వపరంగా అన్ని విభాగాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినా హైకోర్టు ఏర్పాటు కాకపోవడపం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని అడ్వొకేట్ జేఏసీ చైర్మన్ ఎం రాజేందర్రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications