కుట్రే: లోకసభ ఘటనలపై యనమల, ఎర్రబెల్లి మాట
హైదరాబాద్: తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే సమయంలో లోకసభలో జరిగిన సంఘటనలు కుట్రలో భాగంగానే జరిగాయని తెలుగుదేశం సీమాంధ్ర సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలా, వద్దా అనే విషయంపై ఓటింగ్ పెట్టాలని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్ చేశారు. సీమాంధ్ర ప్రజల ఆవేదనను సభలో చెప్పే హక్కు లేదా అని ఆయన అడిగారు.
సోనియా, మన్మోహన్ సింగ్, సుశీల్ కుమార్ షిండే స్క్రిప్టు ప్రకారమే పార్లమెంటు సంఘటనలు జరిగాయని ఆయన ఆరోపించారు. సోనియా, మన్మోహన్ సింగ్ సభకు రాకపోవడం కుట్ర కాదా అని ఆయన అడిగారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెసు ప్రభుత్వ హయాంలోనే ముడు ప్రధాన సమస్యలు వచ్చాయని ఆయన విమర్సించారు.
కాగా, తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు మాట మరో విధంగా ఉంది. కాంగ్రెసు పార్టీ తీరు వల్లనే పార్లమెంటు ఘటనలు చోటు చేసుకున్నాయని ఆయన విమర్శించారు. పార్లమెంటరీ వ్యవస్థను అవమానించారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీ నాటకాలు ఆడుతోందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కాంగ్రెసులో విలీనం కావడానికి అంగీకరించినప్పుడే తెలంగాణ వస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెసులో తెరాసను విలీనం చేస్తారా లేదా అనేది కెసిఆర్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ బిల్లు ఆమోదం పొందకపోతే బాధ్యత కాంగ్రెసు, తెరాసలదేనని ఆయన అన్నారు. తమ పార్టీ పార్లమెంటు సభ్యులు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, ఆ విషయాన్ని నామా నాగేశ్వర రావు చెప్పారని ఆయన అన్నారు. పార్లమెంటుపై దాడి చేస్తే శిక్షించాల్సిన బాధ్యత ఎవరిదని ఆయన అడిగారు. ప్రాంతాలవారీగా విడిపోయి తన్నుకుంటుంటే ఎందుకు గందరగోళం సృష్టిస్తున్నారని ఆయన అడిగారు.