చంద్రబాబుపై ఒత్తిడి: హైదరాబాద్పై పంతం నెగ్గించుకున్న యనమల!
అమరావతి: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదులోనే ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని తొలి నుంచి భావించిన మంత్రి యనమల రామకృష్ణుడు తన పంతం నెగ్గించుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. మంత్రుల ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు పైన ఒత్తిడి పెంచారని చెబుతున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు, అధికారులు ఏపీ నుంచి పాలన సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలోనే బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తే బాగుంటుందని సభాపతి కోడెల శివప్రసాద రావు భావించారు. దీనిపై ముఖ్యమంత్రితో చర్చించి గుంటూరు జిల్లాలోని హాయ్ల్యాండ్కు బృందాన్ని పంపించారు.
కెఎల్ విశ్వవిద్యాలయాన్ని కోడెల పరిశీలించారు. సభ నిర్వహణ సాధ్యాసాధ్యాలపై నివేదిక రూపొందించారు. అక్కడ సమావేశాలకు ఇబ్బంది ఉండదని గుర్తించినట్లుగా తెలుస్తోంది. అయితే, గత శాసన సభలో తర్వాతి సమావేశాలు కూడా హైదరాబాదులోనే నిర్వహిస్తామని మంత్రి యనమల ప్రకటించారు.
ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలు కూడా హైదరాబాదులోనే నిర్వహించాలని యనమల పంతం పట్టి నెగ్గించుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నెల 25వ తేదీన విజయవాడలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో యనమల చక్రం తిప్పారని, పలువురు మంత్రులతో హైదరాబాద్ బెస్ట్ అని ముఖ్యమంత్రికి చెప్పించారని అంటున్నారు. దీంతో హైదరాబాదులోనే సమావేశాలకు సీఎం అంగీకరించారని వార్తలు వస్తున్నాయి.