ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే, రెవిన్యూ లోటును భర్తీ చేయాలి: యనమల
న్యూఢిల్లీ: ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని కోరారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మనోభావాలను అర్ధం చేసుకోని న్యాయం చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని కోరామని యనమల రామకృష్ణుడు ప్రకటించారు.
అరుణ్ జైట్లీతో యనమల భేటీ: అమిత్ షా డుమ్మా, కేంద్రం దిగొచ్చేనా?
ఏపీ రాష్ట్రానికి నిదుల కేటాయింపు, విభజన హమీల అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఏపీ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మెన్ కుటుంబరావు, ఎంపీలు కంభంపాటి హరిబాబు, కింజారపు రామ్మోహన్ నాయుడు, కంభంపాటి రామ్మోహన్ రావు తదితరులు సమావేశమయ్యారు.
బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సూచనతో రెండు పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధుల మధ్య సమావేశం సోమవారం నాడు రాత్రి న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్లో సమావేశమయ్యారు.
ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరిన యనమల
ఏపీ రాష్ట్రానికి న్యాయం జరగాలంటే ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని ఈ సమావేశంలో ఏపీకి చెందిన టిడిపి ఎంపీలు కోరారు. ఏపీ రాష్ట్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరినట్టు ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ఏపీ రాష్ట్రానికి దక్కాల్సిన నిధుల విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి జైట్లీతో చర్చించామన్నారు.ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవశ్యకతను వివరించినట్టు చెప్పారు. ఇతర రాష్ట్రాలకు హోదా ఇస్తున్న సమయంలో తమకు కూడ హోదాను ఇవ్వాల్సిందేనని యనమల రామకృష్ణుడు చెప్పారు.
కేంద్రం లెక్కలతో విబేధించాం
కేంద్రం ఇచ్చిన రెవిన్యూలోటు లెక్కలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కలకు పొంతన లేదని ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రియనమల రామకృష్ణుడు చెప్పారు. రెవిన్యూలోటు రూ. 16 వేల కోట్లను పూడ్చాలని యనమల రామకృష్ణుడు కేంద్రాన్ని కోరారు. ఏపీకి జరిగిన నష్టాన్ని కేంద్రమే పూడ్చాలని జైట్లీని కోరినట్టు యనమల రామకృష్ణుడు చెప్పారు.
ఏపీపై నిర్ణయం తీసుకోవాలని కోరాం
ఏపీ రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల విషయమై కేంద్రం త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని కోరినట్టు ఏపీ బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు హరిబాబు ప్రకటించారు. విదేశీ సంస్థల నుండి పెట్టుబడులు రావడంలో ఆలస్యం జరుగుతోందని హరిబాబు చెప్పారు. ప్రత్యేక హోదాకు సమానంగా ఉన్న ఏపీకి అన్నింటిని సమకూర్చాలని కోరారు.
పార్లమెంట్లో ఆందోళన కొనసాగుతోంది
ఏపీ రాష్ట్రానికి న్యాయం జరిగేవరకు పార్లమెంట్లో టిడిపి ఎంపీల ఆందోళన కొనసాగుతోందని ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృస్ణుడు చెప్పారు. మరోసారి ఏపీ రాష్ట్రానికి దక్కాల్సిన వాటాల విషయమై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో సమావేశం కావాలని నిర్ణయం తీసుకొన్నట్టు చెప్పారు.