జనసేన సత్తెనపల్లి నియోజకవర్గ అభ్యర్థి ఖరారు?
వచ్చే ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జనసేన అందుకు తగ్గ కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళుతోంది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ పై నిత్యం విమర్శలు గుప్పించడంతోపాటు వ్యక్తిగత విషయాలను కూడా ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేసే కొందరు మంత్రులను ప్రత్యేక టార్గెట్ గా పవన్ కల్యాణ్ పెట్టుకున్నారు. రానున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోను వీరిని ఓడించాలనేది జనసేనాని లక్ష్యం.

చెప్పు చూపిస్తూ మాట్లాడిన పవన్
అందులో భాగంగా అంబటి రాంబాబుపై దృష్టిసారించారు. గత ఎన్నికల్లో దివంగత డాక్టర్ కోడెల శివప్రసాద్ పై స్వల్ప మెజారిటీతో గెలుపొందిన అంబటి రెండోవిడత మంత్రి వర్గ విస్తరణలో పదవిని చేజిక్కించుకున్నారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడం ప్రారంభించారు. రోజా, గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్ తోపాటు అంబటి నిత్యం పవన్ కల్యాణ్ పై విరుచుకుపడేవారు. తన వ్యక్తిగత విషయాలేవీ ప్రస్తావించవద్దని, తన పెళ్లిళ్ల గురించి కూడా ప్రస్తావించవద్దని, ఏదైనా ఉంటే రాజకీయంగానే విమర్శించాలని జనసేన పార్టీ బదులిచ్చేది. అయినప్పటికీ తీరు మారకపోవడంతో ఆగ్రహానికి గురైన పవన్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో చెప్పు చూపిస్తూ మాట్లాడిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఇది సంచలనం రేకెత్తించింది.

అవినీతి ఆరోపణలను ఖండించిన అంబటి
అంబటి రాంబాబు లక్ష్యంగా పవన్ కల్యాణ్ వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు నష్టపరిహారం అందించేందుకు సత్తెనపల్లి వచ్చిన పవన్ అంబటి అవినీతిని ప్రస్తావించారు. ఒక కార్మికుడికి వచ్చిన ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అందిన రూ.5 లక్షల చెక్కును ఆ కుటుంబానికివ్వాలంటే లంచం అడిగారంటూ ఆరోపించారు. అంతస్థాయికి తాను దిగజారిపోలేదని దాన్ని మంత్రి రాంబాబు ఖండించారు. అంబటి రాంబాబుకు, జనసేనకు మధ్య యుద్ధం నడుస్తున్నంతకాలం తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మక మౌనం పాటించింది.

యర్రం వెంకటేశ్వరరెడ్డి సరైన అభ్యర్థి అవుతారు..
అంతేకాకుండా పొత్తులో భాగంగా సత్తెనపల్లి సీటు జనసేనకు కేటాయించడం దాదాపు ఖరారైందని తెలుస్తోంది. అభ్యర్థిని ఎంపిక చేయడంపై జనసేన దృష్టిసారించింది. గతంలో ముందస్తు సన్నాహాలు లేకుండా పోటీచేసి దెబ్బతినడంతోపాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి కారణమవడంతో పవన్ కల్యాణ్ ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో 2004, 2009 ఎన్నికల్లో వరుసగా తన ప్రత్యర్థులైన కల్లం అంజిరెడ్డి, నిమ్మకాయల రాజనారాయణపై విజయం సాధించిన యర్రం వెంకటేశ్వరరెడ్డి రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి మూడోస్థానంలో నిలిచారు. తర్వాత జనసేన పార్టీలో చేరి గత ఎన్నికల్లో గాజుగ్లాసు గుర్తుపై పోటీచేసి 9వేల చిల్లర ఓట్లు సాధించారు. ఫైనల్ గా మాజీ ఎమ్మెల్యే అయిన యర్రం వెంకటేశ్వరరెడ్డినే బరిలోకి దించుతారని జనసేన వర్గాలు వెల్లడించాయి. అంబటి రాంబాబును ఓడించాలంటే తెలుగుదేశం పార్టీతో పొత్తుతోపాటు గత ఎన్నికలను ఎదుర్కొన్న అనుభవం ఉన్న యర్రం వెంకటేశ్వరరెడ్డి సరైన వ్యక్తి అవుతారని జనసేనాని భావిస్తున్నట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications