వైసీపీ సోషల్ మీడియా ఇంఛార్జ్గా జగన్ బంధువు..ఎవరితను?
YS Jagan Mohan Reddy: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమిని ఎదుర్కొనడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది.
పార్టీకి పెట్టని కోటగా ఉంటూ వస్తోన్న సోషల్ మీడియా విభాగాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. మొన్నటి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన తరువాత పూర్తిగా డీలాపడ్డ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపేలా, చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లేలా ఈ వింగ్ను పటిష్టపర్చబోతోంది.

గతంలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విభాగాధిపతిగా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సుదీర్ఘకాలం పాటు పని చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆయన స్థానంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ నియమితులయ్యారు. జాతీయ స్థాయి కార్యకలాపాలతో విజయసాయిరెడ్డి ఢిల్లీలో ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి వచ్చినందున.. ఈ మార్పు చేసింది అప్పట్లో.
సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం, జనసేన సాగించిన దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టడంలో విఫలమైందనే ఆరోపణలు ఎదుర్కొంది. ప్రత్యేకించి- మద్యం, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై వైసీపీ సోషల్ మీడియా ఎదురుదాడి చేయడంలో సక్సెస్ కాలేకపోయిందనే అభిప్రాయం ఉంది.
ఇప్పుడు ఇందులో జవసత్వాలను నింపేలా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వైఎస్ విజయమ్మ తమ్ముడు సుదర్శన్ రెడ్డి అల్లుడు యశ్వంత్ రెడ్డిని తెరమీదికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఆయనను నియమించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ పర్యవేక్షణలో యశ్వంత్ రెడ్డి పని చేస్తారని సమాచారం
సూపర్ 6ను అమలు చేయడంలో చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వం విఫలమైందంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు విమర్శిస్తోన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఇప్పటివరకు అమలు చేసింది ఒక్క సామాజిక భద్రత పింఛన్ల పెంపు మాత్రమే. గతంలో 3,000 రూపాయలు ఉన్న ఆ పింఛన్ మొత్తాన్ని 4,000 రూపాయలకు పెంచింది చంద్రబాబు- పవన్ కల్యాణ్ సర్కార్.
ఇక మిగిలిన హామీలు గానీ, చేసిన సంతకాలకు గానీ ఇప్పటివరకు ఎలాంటి గ్యారంటీ లేకుండాపోయిందంటూ ఆరోపిస్తోన్నారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇప్పటివరకు విడుదల కాలేదని మండిపడుతున్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడానికి ఉద్దేశించిన మహాశక్తి పథకం అమలు ఊసే లేదు.
మహిళలకు ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీ మాటే ఎత్తట్లేదు. తల్లికి వందనంలో జాప్యం చోటు చేసుకుంటోంది. రైతు భరోసా నిధులు విడుదల కాలేదు. ఈ వైఫల్యాలను జనంలోకి మరింత బలంగా తీసుకెళ్లేలా సోషల్ మీడియాను వైసీపీ బలోపేతం చేసుకుంటోందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications