పిఠాపరంలో వైసీపీదే అధిక్యత
ఏపీ రాజకీయాలు మొత్తం కూడా పిఠాపరం నియోజకవర్గం చుట్టూనే తిరుగుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో తాను పిఠాపురం నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో పిఠాపురం నియోజకవర్గం ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారింది. కాపులు అధిక సంఖ్యలో ఉండటం వల్లే పవన్ కల్యాణ్ పిఠాపురంను ఎంచుకున్నారని తెలుస్తోంది. దాదాపు 70 వేలకు పైగానే కాపు ఓటర్లు నియోజకర్గంలో ఉండటంతో పవన్ అక్కడ నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ నియోజకవర్గమే తనకు అనువైనదిగా పవన్ భావిస్తున్నారు.
పవన్ ఇటీవల తన ప్రసంగంలో మాట్లాడుతూ.. పిఠాపురం కాబోయే ఎమ్మెల్యే తానే అని ప్రకటించుకున్నారు. దీంతో పిఠాపురంలో పవన్ గెలుపు నల్లేరుపై నడకే అని అంతా భావించారు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం దీనికి విరుద్దంగా ఉన్నట్టు కనిపిస్తోంది. నియోజకవర్గంలో వైసీపీ బలంగా ఉంది. బలమైన క్యాడర్కు తోడు జగన్ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు వైసీపీకి కలిసి వచ్చే అంశాలుగా చెప్పవచ్చు. ఇక వైసీపీ నుంచి కూడా కాపు నేతే బరిలో ఉండటంతో.. ఓట్లు చీలుతాయని.. తద్వారా అది అధికార పార్టీ అభ్యర్థి గెలుపుకు దోహదపడతాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

వైసీపీ తరుఫున పోటీ చేస్తున్న వంగా గీతా గతంలో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇది ఆమెకు కలిసి వస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. స్థానికులతో వంగా గీతకు నేరుగా పరిచియాలు ఉండటం కూడా అధికార పార్టీకి సానుకూలంగా మారింది. దీనికి తోడు పిఠాపురం నియోజకవర్గ ప్రత్యేక బాధ్యతలను ముద్రగడ, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ముద్రగడ సైతం గతంలో పిఠాపురం ఎమ్మెల్యేగా పని చేశారు. దీంతో తనతో సన్నిహితంగా ఉండే టీడీపీ , జనసేన నేతలను వైసీపీలోకి తీసుకువచ్చే పనిలో పడ్డారాయన

దీనిలో భాగంగానే పిఠాపురం జనసేన కీలక నేతగా ఉన్న శేషుకుమారిని వైసీపీలోకి తీసుకువచ్చేలా ముద్రగడ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఆమె జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. శేషుకుమారి గత ఎన్నికల్లో జనసేన తరుఫున పిఠాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. త్వరలో మరికొంతమంది టీడీపీ , జనసేన నేతలు వైసీపీలోకి వస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.మరోవైపు పొత్తులో భాగంగా పిఠాపురం జనసేనకు వెళ్లడంతో.. టీడీపీ నేతలు అసంతృప్తితో ఉన్నారు. టీడీపీ క్యాడర్ పవన్ కల్యాణ్ గెలుపుకు ఎంత వరకు కృషి చేస్తారనే అనుమానం జనసేన నాయకుల్లో నెలకొంది.

దీనికి తోడు పవన్ కల్యాణ్కు స్థానిక నేతలతో నేరుగా పరిచియం లేకపోవడం జనసేనకు పెద్ద మైనస్గా మారింది. ఇక్కడ జనసేన బలం కన్నా, టీడీపీ క్యాడర్ ఎక్కువ. దీంతో వీరు పవన్ కల్యాణ్ గెలుపుకు ఎంత వరకు నిలబడతారనేది చూడాల్సి ఉంది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో పిఠాపురంలో పవన్ గెలుపు అంత సులువు కాదనే మాటలు వినిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ పూర్తిగా రంగంలోకి దిగి.. గ్రౌండ్ వర్క్ చేసుకుంటే తప్పిస్తే.. పవన్ గెలుపు సాధ్యం కాదని జనసేన కార్యకర్తలే చెబుతున్నారు. ప్రస్తుతానికి అయితే పిఠాపురం రేసులో వైసీపీనే అధిపత్యంలో ఉన్నట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications