ఈడీ విచారణకు హాజరైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే
అనంతపురానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి క్యాసినో వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ అధికారులు నోటీసులు పంపించారు. దీంతో ఆయన బషీర్బాగ్లోని కార్యాలయానికి వచ్చారు. క్యాసినోల వ్యవహారంలో గుర్నాథరెడ్డి పాత్రపై ఈడీ అధికారులు సమాచారం సేకరించారు.
క్యాసినోల ముసుగులో విదేశాలకు నిధుల మళ్లిస్తున్నారని 4 నెలల క్రితం ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసు మరోమారు తెరపైకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల నుంచి జూదం ఆడేవాళ్లను ప్రత్యేక ప్యాకేజీల ద్వారా విదేశాలకు తీసుకెళుతున్నారు. ఇలా వెళ్లే క్రమంలో పెద్దమొత్తంలో నిధుల మళ్లింపునకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో పలువురు టూర్ ఆపరేటర్లపై గత జులైలో ఈడీ కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా పలువురిని విచారించింది. హైదరాబాద్కు చెందిన చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి తదితరుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు.
ఆ తర్వాత కొంతకాలం ఈ కేసు స్తబ్దుగా ఉండిపోయింది. తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులు మహేష్ యాదవ్, ధర్మేందర్ యాదవ్ను హైదరాబాద్ ఈడీ అధికారులు పిలిపించి విచారించడం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ, మరో ఇద్దరికి ఈడీ నోటీసులు జారీచేసింది.ఉమ్మడి మెదక్ డీసీసీబీ ఛైర్మన్ దేవేందర్రెడ్డికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.