వైసిపి ఎమ్మెల్యేలు కూడా రాజీనామానా?...నిజమా?...ఎప్పుడు?
Recommended Video
ప్రధాన రాజకీయ పార్టీల వ్యూహాలు,ప్రతి వ్యూహాలతో ఎపి షేక్ అయిపోతోంది. టిడిపి-వైసిపి, టిడిపి-బిజెపి, వైసిపి-జనసేన ఇలా వివిధ పార్టీలు పరస్పరం తలపడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను అంతకంతకూ వేడెక్కిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవలి కాలంలో తన అనూహ్యమైన వ్యూహాలతో టిడిపి అధినేత చంద్రబాబును ఇరుకున పెడుతున్న వైసిపి అధినేత జగన్ తాజాగా మరోసారి ఆ పార్టీపై ఒత్తిడి పెంచేందుకు మరో షాక్ ఇచ్చేందుకు సంసిద్దమైనట్లు తెలుస్తోంది.
ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు గాను తమ పార్టీ ఎంపీలు ఏప్రిల్ 6 న రాజీనామా చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన వైసిపి ఈసారి టిడిపి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు మరో వ్యూహంతో సిద్దమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ తాజా వ్యూహం ప్రకారం రాజ్యసభ ఎన్నికల తరువాత వైసిపి ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించనున్నట్లు తెలిసింది. టిడిపి ప్రభుత్వం తీరు వల్లే రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని, అందుకు నిరసనగా తమ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించడం ద్వారా టిడిపిని డిఫెన్స్ లోకి నెట్టాలనేది జగన్ ప్లాన్ గా తెలుస్తోంది.
వైసిపి ఎమ్మెల్యేలు రాజీనామానా?...చేస్తారా?...
ఇటీవలి కాలంలో దూకుడు నిర్ణయాలతో టిడిపిని ఇరుకున పెడుతున్న వైసిపి అధినేత జగన్...తాజాగా మరో కొత్త ప్లాన్ తో టిడిపికి షాక్ ఇచ్చేందుకు వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మార్చి 23న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు ముగిసిన అనంతరం వైసిపి తమ ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించాలని, తద్వారా టిడిపిని ఇరుకున పెట్టాలని భావిస్తోందట. బిజెపి, టిడిపిల వ్యవహారం వల్లే ఎపికి అన్యాయం జరుగుతోందని, కేంద్రం వైఖరికి నిరసనగా ఎంపీల రాజీనామా...ఎపిలో టిడిపి వ్యవహార శైలిని నిరసిస్తూ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించాలని ఆ పార్టీ నిర్ణయించిన్నట్లు సమాచారం.
వైసిపి ఎమ్మెల్యేల రాజీనామా...ఎందుకోసం?
వైసిపి ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని త్యాగాలకు సిద్దపడినట్లు అవుతుంది. రాష్ట్రం కోసం ప్రజల కోసం తాము ఎంతకైనా తెగిస్తామని, మాటల పోరాటం కాకుండా చేతల్లో చూపుతామనే అభిప్రాయం ప్రజల్లో కలిగించేందుకు వైసిపి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయడం అంటే సీరియస్ వ్యవహారమే కాబట్టి ప్రజల దృష్టిలో మంచి మార్కులు కొట్టేందుకు వైసిపి ఈ రిస్క్ తీసుకోవాలని భావిస్తోందట. మరోవైపు అధికార టిడిపి పార్టీని ఈ నిర్ణయంతో అనేక విధాల ఇబ్బంది పెట్టొచ్చని అంచనా వేస్తోందట.
వైసిపి ఎమ్మెల్యేలు...రాజీనామాలు ఏమవుతుంది?...
వైసిపి ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే టిడిపి ప్రభుత్వానికి సాంకేతికపరంగా వచ్చే ఇబ్బందులు ఏమీ లేవు...కానీ నైతికంగా ఆ పార్టీని దెబ్బ కొట్టేందుకే వైసిపి ఈ రిస్క్ చెయ్యాలని భావిస్తున్నట్లు అర్ధమవుతోంది. ఎలాగూ వైసిపి ఎమ్మెల్యేలు ఫిరాయింపు రాజకీయాలకు వ్యతిరేకంగా అసెంబ్లీ బహిష్కరిస్తున్నట్లు గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. అందువల్ల వారు ఎలాగూ అసెంబ్లీకి వెళ్లేదిలేదు. మరోవైపు వైసిపి ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా వారి రాజీనామాలు వెంటనే ఆమోదించే అవకాశాలు లేవు. కారణం వీరికి ముందుగా రాజీనామాలు చేసిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామాలు ఇంతవరకు ఆమోదం పొందకపోవడమే వైసిపి ఎమ్మెల్యేల రాజీనామాలు వెంటనే ఆమోదం పొందకుండా అడ్డుగా నిలిచే అవకాశం ఉంది.
రెండు విధాలా లాభదాయకం...అందుకేనా ఈ నిర్ణయం
ఎప్పటినుంచో స్పీకర్ వద్ద పెండింగ్ లో ఉన్న వైసిపి ఫిరాయింపు ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదించకుండా తాజా రాజీనామాలు ఆమోదించే అవకాశం లేదు. ఒకవేళ స్పీకర్ అసాధారణ నిర్ణయం తీసుకున్నా అది టిడిపికి నష్టదాయకంగా మారే అవకాశం ఉంది. పైగా సార్వత్రిక ఎన్నికలు అంతకంతకు దగ్గిర పడుతున్న తరుణంలో ఈ రాజీనామాలపై నిర్ణయం తీసుకోవడం లేటయ్యే కొద్దీ వైసిపికే లాభదాయకంగా మారుతుంది. ఎలాగంటే ఎన్నికలు ఆర్నెల్ల లోపు జరిగే అవకాశం ఉంటే అక్కడ ఉపఎన్నికలకు ఎన్నికల కమీషన్ ఆమోదం లభించే అవకాశం లేదు కాబట్టి...ఇటు స్పీకర్ ఆమోదించక, అటు ఎన్నికల తరుణానికి సమీపిస్తే ఇక వైసిపి ఎమ్మెల్యేలకు రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీనామా చేసిన క్రెడిట్ దక్కుతుంది...మరోవైపు ఎమ్మెల్యేల పదవీ భద్రంగానే ఉంటుందనేది ఆ పార్టీ వ్యూహంగా భావించవచ్చు...వైసిపి ఎంపీల రాజీనామా విషయంలోనూ ఇలాంటి ఆరోపణే రావడం గమనార్హం...
పాదయాత్రలో ఉండి...వ్యూహాల్లో దూకుడు
జగన్ సాధారణంగా ఉన్నప్పటి పాదయాత్రలో ఉండి అమలు చేస్తున్నవ్యూహాలు ఇటీవలి కాలంలో టిడిపిని బాగానే ఇబ్బంది పెడుతున్నట్లు కనిపిస్తోంది. అవి పికే వ్యూహాల చతురతా?...జగన్ లో వచ్చిన రాజకీయ పరిణతా? లేక సీనియర్ల సలహాలు ఆలకించడమా?...లే ఇవన్నీనా?...కారణాలు ఏమైనా కానీ ఒకవైపు జగన్ పాదయాత్రలో పాల్గొంటూనే మరోవైపు టిడిపి అధినేత చంద్రబాబు వ్యూహాలకు ప్రతివ్యూహాలను అమలు చేస్తున్న తీరు రాజకీయ పరిశీలకులని సైతం ఆశ్చర్యపరుస్తోంది. పాదయాత్రలో ఉంటూనే తమ పార్టీలో అసంతృప్త నేతలను బుజ్జగిస్తూ, గ్రూపు రాజకీయాలకు ముగింపు పలుకుతూ, ప్రత్యర్ధుల్లా మెలుగుతున్న ఇరు వర్గాల నేతలకు సయోధ్య కుదిరిస్తూ...మరోవైపు టిడిపి,జనసేన వంటి ప్రత్యర్థి పార్టీలకు ధీటుగా ఎదుర్కొంటున్న జగన్ లో వ్యూహ చతురత పెరిగినట్లే కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.