రైతులకు ప్లాట్లు ఇస్తాం..కానీ..:పవన్ వ్యాఖ్యల వెనుక: రైతుల ముసుగులో..అంబటి కీలక వ్యాఖ్యలు..!
ముఖ్యమంత్రి మూడు రాజధానుల ప్రకటనతో..అమరావతిలో జరుగుతున్న ఆందోళనల పైన వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. జగన్ మూడు రాజధానులకు అవకాశం అనే చెప్పారని అంబటి వివరణ ఇచ్చారు. హైదరాబాద్ లో అభివృద్ధి అంతా ఒకటే చోట ఉండటం వలన ..ఏపీ ప్రజలు భారీగా నష్టపోయారని..తిరిగి అటువంటి పరిస్థితి రాకూడదనేదే తమ విధానం అని స్పష్టం చేసారు. అమరావతి అనేది పెద్ద కుంభకోణమంటూ ఆరోపించారు.
చంద్రబాబు తనకు వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోకుండా..అమరావతిలో తన వారికి మేలు చేసారని చెప్పుకొచ్చారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల కు న్యాయం జరుగుతుందని..వారికి తిరిగి ప్లాట్లు కూడా ఇస్తామని..అయితే వారు ఆశించినంతగా అక్కడ అభివృద్ధి ఉండదని కీలక వ్యాఖ్యలు చేసారు.
రైతులు నష్టపోరు..ప్రభుత్వ ప్లాట్లు ఇచ్చినా..
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన రాజధానిలో జరుగుతన్న ఆందోళన పైన వైసీపీ నేత అంబటి కీలక వ్యాఖ్యలు చేసారు. రైతుల ముసుగులో రాజకీయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. రాజధాని రైతుల నుండి దౌర్జన్యంగా భూములు సేకరించారని వ్యాఖ్యానించారు. కొంత మంది రైతులు స్వచ్చందంగా భూములు ఇచ్చారని..రైతులకు అన్యాయం జరగదని చెప్పుకొచ్చారు.
నాటి ప్రభుత్వ ఒప్పందం మేరకు రైతులకు తిరిగి ప్లాట్లు అందిస్తామని..అయితే అవి వారు ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందే అవకాశం ఉండదని కీలక వ్యాఖ్యలు చేసారు. వారికిచ్చే ప్లాట్లు ఏం చేసుకుంటారో వారే ఆలోచించాలని సూచించారు. అదే సమయంలో రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని..జగన్ ప్రతిపాదనల పైన రాష్ట్రంలో సంతోషం వ్యక్తం అవుతోందని రాంబాబు చెప్పుకొచ్చారు.
పవన్ వ్యాఖ్యల వెను పరమార్ధం..
ముఖ్యమంత్రి జగన్ శాసనసభలో రాజధాని గురించి మాట్లాడిన వెంటనే జనసేన అధినేత పవన్ చేసిన ట్వీట్ పైన అంబటి స్పందించారు. పవన్ తన ట్వీట్ లో చేసిన వ్యాఖ్యలో ఎవరి పాత్ర ఎవరిదో ఆయనే స్పష్టం చేయాలని వ్యాఖ్యానించారు. చంద్రబాబు హాయంలో రాజధాని పేరుతో కుంభకోణానికి పాల్పడ్డారని విమర్శించారు. తమ అనుచరులకే న్యాయం చేసారని దుయ్యబట్టారు.
4070 ఎకరాలు చంద్రబాబు అనుచరులే దక్కించుకున్నారని తీవ్రంగా ఫైర్ అయ్యారు. చివరకు దళితులకు దక్కాల్సిన అసైన్డ్ భూములను దౌర్జన్యంగా దక్కించుకున్నారని విమర్శించారు. దీని కారణంగానే ప్రభుత్వం వాటిని రద్దు చేసి తిరిగి హక్కు దారులకు అప్పగించాలని నిర్ణయించిందని వివరించారు. జగన్ ఏం చేసినా..వ్యతిరేకించటం చంద్రబాబుకు అలవాటేనని విమర్శించారు.
రాజధానులు అంటే నిర్మాణాలు కాదు..
జగన్ ప్రతిపాదించిన రాజధానులు ..అంటే కొత్తగా నిర్మాణాలు కాదని అంబటి స్పష్టం చేసారు. మౌళిక వసతులను ఏర్పాటు చేస్తూ..మూడు రీజియన్లలో సమానంగా పాలనా అవకాశాలు కల్పించటమే లక్ష్యంగా అధికార వికేంద్రీకరణకు నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారని వివరించారు. ఇప్పటికీ ప్రజలను మభ్య పెట్టి మోసం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. దీని పైన అన్ని కోణాల్లో చర్చించి నిర్ణయాలు ఉంటాయని అంబటి స్పష్టం చేసారు.