ప్రపంచంలో ఎక్కడ ఏ కుంభకోణం జరిగినా...అందులో చంద్రబాబు పేరే:బొత్స
విజయవాడ:ప్రపంచంలో ఎక్కడ, ఏ కుంభకోణం జరిగినా అందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరు ఉంటోందని వైసిపి సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.
Recommended Video

ఎయిర్ ఏషియా కుంభకోణం సంభాషణల్లో కేంద్ర విమానయాన శాఖ మాజీ మంత్రి అశోక్గజపతిరాజు, సిఎం చంద్రబాబు పేర్లు బయటకు రావడంతో వీరి ప్రమేయం గురించి స్పష్టంగా బైటపడిందన్నారు. చంద్రబాబును ప్రసన్నం చేసుకుంటే అనుమతులొస్తాయని సదరు విమానయాన సంస్థ సిఈఓల సంభాషణల్లో తేలిందన్నారు. ఈ విధమైన కుంభ కోణాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పరువును చంద్రబాబు మంటగలుపుతున్నారని బొత్సా ధ్వజమెత్తారు.

2016లో చంద్రబాబు ఆదేశాలతోనే ఎయిర్ ఏషియా అనుమతులకు అశోక్గజపతిరాజు పొడిగింపు జీఓ ఇచ్చారన్నారు. ఈ లాబీయింగ్ కోసమే హెచ్ఎన్ఆర్ అనే సింగపూర్ సంస్థకు రూ.12.28 కోట్లు నగదు బదిలీ జరిగిందని ఆరోపించారు. ఈ విధమైన కార్యకలాపాల ద్వారా చంద్రబాబుకి ఎంపి అశోక గజపతి రాజు చప్రాసీగా మారారన్నారు.
వైసిపి ఎంపీల రాజీనామాలపై టిడిపి నేతలు చట్టాలు తెలియకుండా మాట్లాడుతున్నారని బొత్సా మండిపడ్డారు. బిజెపితో టిడిపినే చీకటి ఒప్పందాలు చేసుకుని ఆ పార్టీ నేతలు ప్రతిపక్షం వైసిపి పై బురదజల్లుతున్నారన్నారు. చంద్రబాబు అవినీతి రాజకీయాలు, మోసాలను ప్రజలు గుర్తించారని...ఆయనకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని బొత్సా చెప్పారు.












Click it and Unblock the Notifications