చంద్రబాబు చేతులెత్తేసారు - పవన్ అక్కడే పరిమితం..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేస్తున్న శ్వేతపత్రాల పై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అసత్యాలతో..తప్పుడు అంకెలతో వీటిని విడుదల చేస్తున్నారని వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని మండిపడ్డారు. నెల రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో హామీలు అమలు చేయకుండా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ ఇస్తామన్నారని.. ఇప్పుడు ఎక్కువగా బిల్లులు వేస్తున్నారని ఆరోపించారు.
మాట మార్చారు
చంద్రబాబును ట్రూఅప్ ఛార్జీల గురించి ప్రశ్నిస్తే తాను విద్యుత్ ఛార్జీలు పెంచననే మాట ఎప్పుడు అన్నానని ప్రశ్నిస్తున్నారని విమర్శించారు. అమరావతి నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందంటే సరైన సమాధానం చంద్రబాబు చెప్పలేకపోతున్నారని వివరించారు. సంపద సృష్టించి అమరావతిని పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారని గుర్తు చేసారు. 2019లో చంద్రబాబు సృష్టించిన సంపద ఎక్కడ ఉందో ఎవరికీ కనపడలేదన్నారు. అప్పులు సృష్టించటంలో ఏపీని మొదటి స్థానంలో చంద్రబాబు నిలబెట్టారని విమర్శించారు.

మోసపూరితం
చంద్రబాబు నిర్వాకం కారణంగానే పోలవరం నాశనమైందని పేర్ని నాని ఆరోపించారు. చంద్రబాబు కారణంగానే డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందన్నారు. నచ్చినోళ్లకు కాంట్రాక్టు ఇచ్చి పోలవరం నాశనంకు కారణం అయ్యారని చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలో ప్రతీ పిల్లాడికి రూ 15 వేలు ఇస్తామన్నారని...తల్లికి వందనం అంటూ ఇప్పుడు జనాన్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఆరడుగుల అబద్దమని పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ మాటలు కోటలు దాటించారన్నారు. ఇప్పుడు ఉచితం పేరుతో దోచుకోవటానికి ఇసుక పాలసీ తెచ్చారని మండిపడ్డారు.
పవన్ పరిమితం
జగన్ అధికారంలో ఉంటే తల్లుల ఖాతాల్లో అమ్మఒడి నిధులు జమ చేసేవారన్నారు. జగన్ సీఎం అయ్యే నాటికే ఖజానా ఖాళీ అయిందని..అప్పుడ కూడా పుట్టదని యనమల చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసారు. పవన్ కేవలం పంచాయితీరాజ్ కే పరిమితం అయ్యారని..మరో శాఖ వైపు చూడటం లేదని పేర్ని నాని వ్యాఖ్యానించారు. బీజేపీ, చంద్రబాబు కోసమే షర్మిల రాజకీయం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.అధికారంలో ఉన్నవారిని వదిలేసి తమను ప్రశ్నించటం ఏంటని నిలదీసారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసారని నాని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications