బినామీలకు రూ.240 కోట్ల భూమి: బాబు, లోకేష్లపై వైసిపి తీవ్ర ఆరోపణలు
కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై, ఆయన కుమారుడు నారా లోకేష్పై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతి పనిలోనూ లక్షల కోట్ల రూపాయల అవినీతికి వారు పాల్పడ్డారని వారన్నారు.
రూ.240 కోట్ల విలువ చేసే భూమిని జివో నెంబర్ 523, 547 ద్వారా చంద్రబాబు తన బంధువులకు కారుచౌకగా అప్పజెప్పారని వారన్నారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు రవీంద్రనాథ్ రెడ్డి, రఘురామిరెడ్డి, సురేష్ బాబు సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు.
మూడేళ్లు సంసారం చేసి ఇప్పుడు మూడు పార్టీలు టిడిపి, బిజెపి, జనసేన ఒకదానిపై ఒకటి నిందలు వేసుకుంటున్నాయని వారన్నారు. లక్షల కోట్ల రూపాయల నిధులను దుర్వినియోగం చేసి ఇప్పుడు కేంద్రం ఇవ్వలేదని టిడిపి చెప్పడం ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు.
మొదటి నుంచి హోదా కోసం పోరాడుతున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డేనని అన్నారు. ప్రత్యేక హోదా బ్రాండ్ అంబాసిడర్ ఆయనేనని వారు చెప్పారు ప్రత్యేక హోదా ఇచ్చే ఏ పార్టీకైనా మద్దతు ఇస్తామని అన్నారే తప్ప బిజెపికి మద్దతు ఇస్తామని జగన్ ఎప్పుడూ చెప్పలేదని వారు స్పష్టం చేశారు.
మంత్రి ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు నియోజకవర్గం ప్రజలకు చేసిందేమీ లేదని వారన్నారు. గండికోట ముంపు బాధితులకు ఇంత వరకు నష్టపరిహారం చెల్లించలేదని వారు గుర్తు చేశారు. కేంద్రం అడుగుతున్న ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని వారన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి వసూళ్ల కోసమే చంద్రబాబు పనిచేస్తున్నారన వారు ఆరోపంచారు.