ఎమ్మెల్యే రోజాకు ప్రముఖుల పరామర్శ , ఫ్యామిలీకి టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఫోన్
నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా సెల్వమణి ఆసుపత్రిలో ఇటీవల రెండు మేజర్ సర్జరీలు చేయించుకున్న విషయం తెలిసిందే. సర్జరీల అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోజాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రముఖులు, కీలక నాయకులు పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేస్తున్నారు. టీడీపీ నాయకుడు, సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా రోజా ఆరోగ్యంపై ఆరా తీశారు.
మరోమారు చంద్రబాబుపై విరుచుకుపడ్డ రోజా .. లోకేష్ కు చురకలు
రోజాను పరామర్శిస్తున్న వైసీపీ నేతలు
టిడిపి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ఏపీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిన్న చెన్నైలోని ఆసుపత్రికి చేరుకుని రోజా ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చెన్నై అడయార్ లోని ఫోర్టీస్ మలర్ ఆస్పత్రిలో ప్రస్తుత రోజా చికిత్స పొందుతున్నారు. రోజా త్వరగా కోలుకోవాలని, తిరిగి ప్రజాసేవకు పునరంకితం కావాలని టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ఆకాంక్షించారు. రోజా ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
రోజా ఆరోగ్యం కోసం పుత్తూరు మున్సిపాలిటీ కౌన్సిలర్ల మహా మృత్యుంజయ యాగం
మరోవైపు రోజా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని పుత్తూరు మున్సిపాలిటీకి చెందిన కౌన్సిలర్లు మహా మృత్యుంజయ యాగాన్ని నిర్వహించారు. రోజా ఆరోగ్యం కోసం పూజలు, ప్రార్థనలు చేశారు రోజా అభిమానులు.
ఇదిలా ఉంటే టిడిపి హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ కూడా రోజా ఆరోగ్యంపై ఆరా తీశారు. ప్రత్యర్ధి పార్టీ నేత నందమూరి బాలకృష్ణ రాజకీయాల్లోకి రాక ముందు నుండి తనతో కలిసి సహనటిగా నటించిన రోజాతో మంచి సంబంధాలను నెరపుతూ వచ్చారు. అప్పటి నుండి ఇప్పటి వరకు వారిద్దరి మధ్య స్నేహం అలాగే కొనసాగుతుంది.
రోజా ఆరోగ్యం పై కుటుంబ సభ్యులకు కాల్ చేసిన బాలకృష్ణ
పలు సందర్భాల్లో రోజా బాలకృష్ణ పై వ్యాఖ్యలు చేసినా, బాలకృష్ణ మాత్రం రోజాను ఏరోజు ఒక్క మాట కూడా అనలేదు. తాజాగా అనారోగ్య కారణాలతో చెన్నైలోని ఆసుపత్రిలో రెండు మేజర్ ఆపరేషన్లు చేయించుకుని చికిత్స పొందుతున్న రోజా ఆరోగ్యంపై, రోజా ఫ్యామిలీ కి కాల్ చేసి మాట్లాడారు. రోజా ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. రోజా త్వరగా కోలుకుని తిరిగి అంతే యాక్టివ్ గా తన దైనందిన కార్యక్రమాలలో పాల్గొనాలని బాలకృష్ణ ఆకాంక్షించారు.
పార్టీలు వేరైనా బాలయ్య, రోజాల మధ్య సత్సంబంధాలు
బాలయ్య ,రోజా ల మధ్య పార్టీలు వేరైనా మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయని గతంలో ఏపీ శాసన మండలి సమావేశాల సమయంలోనే అందరికీ అర్థమైంది. వైసిపి నగిరి ఎమ్మెల్యే రోజా, బాలకృష్ణతో కలిసి సెల్ఫీ తీసుకోవడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు తాజాగా టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ రోజాను పరామర్శించడం కూడా చర్చనీయాంశంగా మారింది.