శ్రీవారి బ్రేక్ దర్శనాల్లో వైసీపీ నేతల కొత్త రికార్డు..!!
కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత టీటీడీ ప్రక్షాళనపైన ఫోకస్ చేసింది. ఇప్పటికే కొత్తగా నియమితులైన ఈవో శ్యామలా రావు భక్తుల సదుపాయాల పైన కసరత్తు చేస్తున్నారు. ఇక..గత అయిదేళ్ల కాలంలో తీసుకున్న నిర్ణయాల పైన విచారణ కొనసాగుతోంది. ఇదే సమయంలో గత పాలక వర్గం హాయంలో వైసీపీకి చెందిన మంత్రులు తమ సిఫారసు లేఖలతో భారీగా వీఐపీ బ్రేక్ దర్శనాలు పొందిన ఉదంతాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి.
బ్రేక్ దర్శనాలకు లేఖలు
వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన వారితో సహా వైసీపీ ముఖ్య నేతలు తిరుమల బ్రేక్ దర్శనాల్లో కొత్త రికార్డు నెలకొల్పారు. చిత్తూరు జిల్లా నుంచి మంత్రులుగా పని చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా తమ అనుచర వర్గానికి బ్రేక్ దర్శనం కోసం ఇచ్చిన లేఖలు ప్రస్తుతం బయటకు వచ్చాయి. మంత్రిగా ఉన్న సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 12న నాలుగు తోమాలసేవ, ఆరు ప్రొటోకాల్ దర్శనాలు, 12 మందికి కల్యాణోత్సవం, 52 మందికి వీఐపీ బ్రేక్ దర్శనాలు చొప్పున 74 మందికి ఆర్జితసేవ, బ్రేక్ దర్శనాలకు ఆయన సిఫారసు చేశారని దాని ద్వారా తేలింది.

భారీ సంఖ్యలో దర్శనాలు
అదే విధంగా ఆర్కే రోజా ఏపీఐఐసీ చైర్పర్సన్గా ఉన్నప్పుడు (అప్పటికి ఇంకా మంత్రి కాలేదు).. 2021 నవంబరు 30న కనీసం భక్తుల పేర్లు కూడా లేకుండా 20 మందికి బ్రేక్ దర్శనాలు కేటాయించాలని లేఖ రాశారు. వీరి తరహాలోనే జిల్లాకు చెందిన నాటి ఉపముఖ్యమంత్రి కె.నారాయణస్వామి, నాటి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డితోపాటు పలువురు మంత్రులు రోజుకు పదుల సంఖ్యలో వీఐపీ బ్రేక్ దర్శనం, ఆర్జిత సేవా టికెట్లు పొంది.. సామాన్య భక్తులు క్యూలైన్లో అగచాట్లు పడేలా చేశారనే విమర్శలు ఉన్నాయి. దీంతో, బ్రేక్ దర్శనాల సంఖ్య భారీగా పెరిగింది.
సామాన్యులకు ఇబ్బందులు
సిఫారసులతోనే కాకుండా పదవులను అడ్డుపెట్టుకుని వైసీపీ మంత్రులు నెలలో 2-3సార్లు శ్రీవారి దర్శనానికి వచ్చేవారు. రోజా, వేణుగోపాలకృష్ణ, నారాయణస్వామి, మేరుగ నాగార్జున, కారుమూరి నాగేశ్వరావు, నాటి ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, గోరంట్ల మాధవ్, బెల్లాన చంద్రశేఖర్ వంటి వారు తరచూ మందీమార్బలంతో వచ్చేవారని అధికారులు చెబుతున్నారు. 2022 ఆగస్టులో మంత్రి ఉషశ్రీ చరణ్ ఒకేసారి 50మందితో శ్రీవారిని దర్శించుకున్నారు. అదే రోజు 10 సుప్రభాతసేవ టికెట్లు కూడా పొందారు. అదే నెల 18న మంత్రి రోజా 30 మందితో వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకున్నారు. ఇలా వైసీపీ ముఖ్యులు తమ హోదాతో అనుచర వర్గానికి బ్రేక్ దర్శనాల కోసం సామాన్య భక్తులను ఇబ్బంది పెట్టారని టీడీపీ ఆరోపిస్తోంది.












Click it and Unblock the Notifications