దగ్ధంపై అరెస్టులు చేయరా: జగన్ పార్టీ ఎమ్మెల్యే
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజధాని ప్రాంత భూముల్లో పంటలను దహనం చేసినవారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై గుంటూరు జిల్లా మంగళగిరి వైయస్సార్ కాంగ్రెసుపార్టీ శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) ప్రశ్నించారు. శనివారం హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని వ్యవహారంలో ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వ్యక్తుల పేర్లు చెప్పాలని కొంతమందిని నిర్భంధించి చిత్రహింసలు పెడుతున్నారన్నారు. మంగళగిరి రైతులను ఇప్పటికీ తుళ్లూరు పోలీసులు బెదిరింపులకు గురిచేస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎమ్మేల్యేలు భయభ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. పేద రైతులకు, రైతు కూలీలకు తమ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రతిపాదిత గ్రామాలు అయిన ఉండవల్లి, పెనుమాక గ్రామాలలో అరటి తోటలు, వ్యవసాయ సామాగ్రిని తగులబెట్టిన వారి ఆచూకీ చెబితే రూ.5 లక్షలు బహుమతిగా ఇస్తామని గుంటూరు రేంజ్ ఐజీ సునీల్ కుమార్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఐజీ చెప్పారు. నిందితుల కోసం 15 బృందాలతో గాలిస్తున్నట్లు చెప్పారు.
ఇదిలావుంటే, గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని రాజధాని ప్రాంతంలో గల అగ్ని ప్రమాదంలో కుట్ర కోణం ఉండవచ్చునని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు ఇటీవల అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటన పైన ఆరు గ్రామాల ప్రజలను విచారించినట్లు చెప్పారు. దీని పైన లోతుగా దర్యాఫ్తు చేసి నిందితులను వీలైనంత త్వరగా పట్టుకుంటామన్నారు. పంటపొలాల దహనం పైన గుంటూరు అర్బన్ ఎస్పీ రాజేష్ కుమార్ స్పందించారు. ఇది దురదృష్టకరమన్నారు. నిందితులను పట్టుకుంటామని చెప్పారు. రూరల్ ఎస్పీ రామకృష్ణ మాట్లాడుతూ.. జరిగిన నష్టం స్వల్పమేనని, ఈ ఘటన పైన రైతులెవరు ఆందోళన చెందవద్దునని చెప్పారు.












Click it and Unblock the Notifications