పవన్ కల్యాణ్ది ‘జనసేన’ కాదు.. ‘భజనసేన’: రోజా
అమరావతి: పవన్ కల్యాణ్ది 'జనసేన' కాదు.. 'భజనసేన' అని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. గురువారం వైసీపీ బృందం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పర్యవేక్షణ సందర్భంగా ఆమె మాట్లాడారు.
Recommended Video

ఈ సందర్భంగా సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబుది తల్లి టీడీపీ అయితే.. పవన్ది పిల్ల టీడీపీ అని, పవన్ కల్యాణ్ మాటలకు, చేతలకూ పొంతన ఉండదని దుయ్యబట్టారు.

బాబు అవినీతిలో ఇరుక్కున్నప్పుడల్లా...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడు అవినీతిలో ఇరుక్కున్నా.. జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ను తెరమీదికి తీసుకొచ్చి అసలు విషయాలను పక్కదోవ పట్టిస్తారని రోజా దుయ్యబట్టారు. ‘‘అనుభవం లేని వ్యక్తి సీఎం అవకూడదని పవన్ అంటున్నారు. ఎలాంటి అనుభవం కావాలో? మరి పిల్లనిచ్చిన మామపై చెప్పులు విసిరి, వెన్నుపోటు పొడిచి సీఎం కావొచ్చా? ఏ అర్హత లేకపోయినా ఎమ్మెల్యేగా గెలవని వ్యక్తిని ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇవ్వొచ్చా? అని రోజా ప్రశ్నించారు. ఇలాంటి వాళ్లకు పవన్ కల్యాణ్ భజన చేయడం ఏమిటంటూ మండిపడ్డారు.

జగన్ యాత్రకు స్పందన వస్తుందని తెలియగానే...
తనపై ఆరోపణలు వచ్చినప్పుడల్లా ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు అలవాటు అని రోజా అన్నారు. అందుకే పోలవరం అవినీతిలో కూరుకుపోగానే రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చి నాటకాలు ఆడుతున్నారని ఆమె విమర్శించారు. అలాగే వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్రకు మంచి స్పందన వస్తుండటంతో మళ్లీ వపన్ కల్యాణ్ను తెరపైకి తీసుకొచ్చి డ్రామా మొదలు పెట్టారని రోజా అన్నారు.

అప్పుడు పవన్ ఎక్కడున్నారు?
వైసీపీ బృందం పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తోందని తెలియగానే పచ్చ ఛానెళ్లు, చంద్రబాబు కలిసి హడావుడిగా పవన్ను పోలవరానికి పంపించారని రోజా వ్యాఖ్యానించారు. దేనినైనా, ఎవరినైనా ప్రశ్నిస్తానని, అన్యాయం, దారుణం జరిగితే ఊరుకోనని చెప్పే పవన్ కల్యాణ్ పుష్కరాల్లో 29 మంది మరణించినప్పుడు ఎక్కడ ఉన్నారని రోజా ప్రశ్నించారు. దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో అమాయకులు చనిపోయినప్పుడు ఈ ప్రశ్నించే వ్యక్తి ఏమైపోయారో అని ఎద్దేవా చేశారు. ఏపీలో మహిళలపై అకృత్యాలు పెరుగుతున్నా పవన్ ఎందుకు మాట్లాడరని రోజా ప్రశ్నించారు.

ప్రశ్నించడానికి కాదు, ప్యాకేజీల కోసమే...
పవన్ కల్యాణ్ తరచూ తాను ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెబుతూ ఉంటారని, కానీ నిజానికి ఆయన ఉన్నది ప్రశ్నించడానికి కాదని, ప్యాకేజీల కోసమేనని రోజా ఎద్దేవా చేశారు. ‘‘పవన్ మాటలు వింటుంటే ఆశ్చర్యమేస్తోంది. అధికారం లేకపోయినా ఏమైనా చేయొచ్చట. అలా అయితే మరి రైతుల ఇబ్బందులు తీర్చేందుకు రుణమాఫీ చేసేయొచ్చు కదా, డ్వాక్రా మహిళల రుణాలు రద్దు చేయొచ్చు కదా, చేస్తారా మరి?..'' అంటూ రోజా చురకలు వేశారు. షూటింగ్ గ్యాప్లో వచ్చి ఇతరులపై నిందలు వేయడం కాదని, చేతనైతే ప్రజల్లో ఉండి ప్రజల తరఫున పోరాడాలని రోజా పవన్ కల్యాణ్కు హితవు పలికారు.












Click it and Unblock the Notifications