నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మూతి పగులుద్ది.. టీడీపీ నేతలకు రోజా వార్నింగ్
వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మరోసారి టీడీపీ నేతలపై మరో సారి ఫైర్ అయ్యారు. దివంగత నేత, మాజీ మంత్రి గాలిముద్దు కృష్ణమనాయుడు కుమారుడు, నగరి టీడీపీ నేత గాలి భాను ప్రకాష్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే.. మూతి పగులుద్ది అంటూ వార్నింగ్ ఇచ్చారు. నోటిని అదుపులో పెట్టుకుని నిజనిజాలు మాట్లాడాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు . మరో సారి ఇలాగే వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
ఇక్కడే చావాలని డిసైడ్ అయ్యా..
ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తాను నగరి ప్రజల మధ్యే ఉంటానని ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు. ఈ ప్రాంత ప్రజలు ఆదరించబట్టే తాను ఈ స్థాయిలో ఉన్నానని పేర్కొన్నారు. ప్రజల మధ్య ఉంటూ .. ఇక్కడే చావాలని డిసైడ్ అయ్యానని అన్నారు. అందుకే నగరిలో ఇల్లు కూడా కట్టుకున్నట్లు రోజా తెలిపారు. తనపై కొందరూ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
భాను ప్రకాష్కి రోజా వార్నింగ్
తాను అక్రమంగా సంపాదిస్తున్నానంటూ నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మూతి పగిలిపోతుందని గాలి భానుప్రకాష్ని ఉద్దేశించి ఎమ్మెల్యే రోజా వార్నింగ్ ఇచ్చారు. అక్రమంగా సంపాదించినట్లు ఆధారాలు ఉంటే రుజువు చేయాలని సవాల్ విసిరారు. కావాలంటే బ్యాంకు బ్యాలెన్స్ బహిర్గతం చేస్తాను.. దమ్ముంటే నిరూపించాలన్నారు. వైసీపీలో ఉన్న కోవర్డుల అండదండలతో తనపై గెలవాలనుకుంటే.. అది పగటి కలే అవుతుందని బాను ప్రకాష్ పై రోజా సెటైర్లు వేసారు.
.ఆంబోతుల్లా నగరి మీద పడి దోచుకుంటున్నారు
నగిరి ఎమ్మెల్యే రోజా అక్రమాలకు అడ్డుఅదుపు లేకుండా పోయిందని ఇటీవల టీడీపీ నేత గాలి భాను ప్రకాష్ ఆరోపణలు చేశారు. ఆంబోతుల్లా నగరి మీద పడి దోచుకుంటున్నారంటూ విమర్శలు గుప్పించారు. నగరి సంపదను రోజా కుటుంబ సభ్యులు కల్లగొడుతున్నారని ఆరోపించారు. ప్రజలకు అప్పులు.. ఎమ్మెల్యే రోజాకు ఆస్తులంటూ ఆగ్రహం వ్యక్త చేశారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, తిరుపతి, నగరిలో వేలాది కోట్ల రూపాయల విలువ చేసే భూములు, ఇళ్లు , ఆస్తులు కూడబెట్టుకున్నారని ఆరోపించారు.
గ్రావెల్ దోపిడీకి ఎమ్మెల్యే రోజా అండ
నగరిలో రోజా కుంటుంబం మాత్రమే సంతోషంగా ఉందని భాను ప్రకాష్ విమర్శలు గుప్పించారు. గ్రావెల్, ఇసుక దోపిడీకి ఎమ్మెల్యే రోజా అండగా నిలుస్తున్నారని అన్నారు. నాడు తన తండ్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు మట్టిని చెన్నైకి తరలిపోకుండా అడ్డుకట్ట వేస్తే... నేడు ఎమ్మెల్యే రోజా మట్టి తరలింపునకు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చి అక్రమాలకు పాల్పడుతున్నారని బాను ప్రకాష్ ఆపించారు. వైసీపీ నేతల దోపిడీకి అడ్డుఅదుపు లేకుండా పోయిందని విరుచుపడ్డారు.