జగన్కు షాక్: టిడిపి వైపు ఆ నలుగురు ఎమ్మెల్యేలు?
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి పెద్ద యెత్తున ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. జిల్లాలోని మెజారిటీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు అధినేత జగన్కు షాక్ ఇవ్వడానికి సిద్ధపడినట్లు ప్రచారం సాగుతోంది. వారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారని అంటున్నారు. గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య త్వరలో టిడిపిలో చేరుతారని ప్రచారం సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కొద్ది రోజులుగా జరుపుతున్న మంతనాలు ఓ కొలిక్కి రావడంతో ఆ నలుగురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి నమస్కారం బాణం పడేసి టీడీపీలో చేరతారని అంటున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో ఏడింట వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులే గెలుపొందారు. నెల్లూరు, తిరుపతి ఎంపీ స్థానాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. ఊహించని రీతిలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు నిరాశకు గురయ్యారు. అంతే కాకుండా, ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే ఒకరిద్దరి ఎమ్మెల్యేల మధ్య వివాదాలు చోటు చేసుకున్నాయి. అయితే, వాటిని పరిష్కరించడంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకత్వం విఫలమైందని అంటున్నారు.

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, వేనాటి రామచంద్రారెడ్డి వర్గాల మధ్య విభేదాలు జోరందుకోవడంతో వాకాటి వర్గం గురువారం రాత్రి మీడియా సమావేశం నిర్వహి్ఇంచింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పాశం సునీల్ పాల్గొనడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అంతే కాకుండా శుక్రవారం జరిగిన ఫ్లెమింగో ఫెస్టివల్లో పాల్గొన్న సునీల్ - ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశంసలు, పొగడ్తలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణను కూడా ప్రశంసించారు దీని వెనుక ఉన్న పరమార్థం సునీల్ టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి సునీల్ గతంలో టీడీపీలో ఉంటూ గూడూరు మున్సిపల్ చైర్మన్గా గెలుపొందారు. ఇక సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య కూడా సునీల్ బాటలోనే నడుస్తారని సమాచారం.
కావలి, సర్వేపల్లి ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కాకాణి గోవర్థనరెడ్డి కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీని వీడి ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. కావలి, సర్వేపల్లి నియోజకవర్గాల్లో ఎన్నికల సందర్భంగా నకిలీ మద్యం పంపిణీకి సంబంధించి కొంతమంది వైసీపీ నేతలపై ఉన్న కేసులను సీబీసీఐడీ దర్యాప్తు చేస్తోంది. జిల్లాలో టీడీపీని పటిష్ఠపరచడంలో భాగంగా మంత్రి నారాయణ కొందరు వైసీపీ ఎ మ్మెల్యేలతో చర్చలు జరిపి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో వారు టిడిపిలోకి వెళ్లి సమస్యల నుంచి గట్టెక్కే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications