కెసిఆర్పై అవాకులు చెవాకులు, రేవంత్పై మౌనమా: బాబుపై వైసిపి ఎంపీ
కడప/ అనంతపురం: ఓటుకు నోటు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై విమర్శల దాడిని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉధృతం చేసింది. ఓటుకు నోటు వ్యవహారంలో అసలు సూత్రధారి చంద్రబాబును తొలి ముద్దాయిగా చేర్చాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు అవినాష్ రెడ్డి డిమాండ్ చేశఆరు.
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపైనా, మరొకరిపైనా అవాకులూ చవాకులూ పేలుతున్న చంద్రబాబు రేవంత్ రెడ్డి వ్యవహారంపై ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన శుక్రవారం సాయంత్రం ప్రశ్నించారు. వీడియో క్లిప్పింగ్లో చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి తన బాస్ చంద్రబాబు పంపితేనే వచ్చానని ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో చెప్పడం దేశ ప్రజలందరూ చూశారని ఆయన అన్నారు.
తన ఫోన్ ట్యాప్ చేశారని చెబుతున్న చంద్రబాబు స్టీఫన్సన్తో తాను ఫోన్లో మాట్లాడిన విషయాన్ని ఎందుకు ఖండించడం లేదని అడిగారు. తన సొంత అవినీతి వ్యవహారాన్ని రెండు రాష్ట్రాల ప్రజల మధ్య వివాదంగా చిత్రీకరించడం చంద్రబాబు మూర్ఖత్వానికి నిదర్శనమని ఆయన అన్నారు. చంద్రబాబు వ్యవహారంలో తెలంగాణ ఎసిబి నిష్పాక్షికంగా విచారణ జరపాలని ఆయన కోరారు.
ఆ కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తనను కాపాడాలని వేడుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని తనకు హామీ ఇచ్చారని, తనకు అనుకూలమైన మీడియాతో ప్రచారం చేయించుకుంటున్నారని అవినాష్ రెడ్డి అన్నారు.
ఇంత బహిరంగంగా చంద్రబాబు అవినీతికి పాల్పడుతుంటే ఎందుకు కేసు నమోదు చేయడం లేదని ఆయన అడిగారు. ఇప్పటికే చంద్రబాబు అవినీతిపై రాష్ట్రపతితో పాటు ఇతర కేంద్ర మంత్రులకు తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సారథ్యంలో తమ పార్టీ వినతిపత్రాలు అందజేసి చంద్రబాబును తొలి ముద్దాయిగా చేచ్రాలని డిమాండ్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంపై చంద్రబాబుకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా తన పదవికి రాజీనామా చేసి నిజాయితీ నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.