మైనింగ్ అనుమతులు తీసుకుంది వైసీపీ ఎంపీ మాగుంట కాదు ; ఆ వార్తల్లో నిజం లేదు : జలవనరుల శాఖ స్పష్టం
ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డిపై కేసు నమోదు చేశారని వచ్చిన వార్తలకు ఏపీ జలవనరుల శాఖ అధికారులు ఖండించారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో మట్టి మాఫియా వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పేరుతో అనుమతులు తీసుకుందని వచ్చిన వార్తల్లో నిజం లేదని, ఎం శ్రీనివాసులు రెడ్డి పేరుతో తీసుకున్న అనుమతులు ఒక సాధారణ వ్యక్తికి సంబంధించి తీసుకున్న అనుమతులని జలవనరుల శాఖ అధికారులు స్పష్టం చేశారు.

సర్వేపల్లి మట్టి తరలింపు వ్యవహారంపై జలవనరుల శాఖ క్లారిటీ
సర్వేపల్లిలో మట్టి తరలింపు అనుమతి తీసుకున్న వారిలో ఎం శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తి, పార్లమెంటు సభ్యులు కారని, ఎంపీ ఆయన లెటర్ హెడ్ మీద కానీ, తన చిరునామాతో కానీ దరఖాస్తు చేసుకోలేదని స్పష్టం చేశారు. సర్వేపల్లి లో ఉదయ్ కుమార్ రెడ్డి పేడూరు, ఎం శ్రీనివాసులు రెడ్డి, బి శ్రీధర్ రెడ్డి అనే ముగ్గురు పేరుతో మట్టి తరలింపు అనుమతులు తీసుకున్నారని, అయితే ఎనిమిది వేల క్యూబిక్ మీటర్లకు అనుమతులు తీసుకున్నవారు, అనుమతులు ఇచ్చిన దానికంటే అదనంగా మట్టిని తరలించినట్లు గుర్తించారు.

అనుమతుల కంటే అదనంగా మట్టి తరలింపు .. నోటీసులు ఇచ్చామన్న అధికారులు
18,629 క్యూబిక్ మీటర్ల మేర మట్టిని తరలించినట్లు క్షేత్రస్థాయిలో గుర్తించి, మట్టి తరలింపు ఆపవలసిందిగా వారికి జలవనరుల శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ వారి మట్టి తరలింపు చేపట్టడంతో అక్రమ మట్టి తరలింపు ఆపవలసిందిగా పోలీసులకు విజ్ఞప్తి చేశామని జలవనరుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కృష్ణ మోహన్ వెల్లడించారు. అదనంగా 10,629 క్యూబిక్ మీటర్ల మేర మట్టి తరలించినందుకు వారికి 10,75,529 రూపాయలు జలవనరుల శాఖకు చెల్లించవలసినదిగా నోటీసులు ఇచ్చామని వెల్లడించారు.

మాగుంట పేరు లేదు .. శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తి ఎంపీ కాదు
ఈ మొత్తం వ్యవహారంలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు లేదని, వారి హోదా ఎక్కడ వాడబడలేదని, ఈ వ్యవహారంపై వివిధ పత్రికల్లో ప్రచురితమైన వార్తలు అవాస్తవమని, సత్యదూరమైన వార్తలని జలవనరుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కృష్ణ మోహన్ ప్రకటన చేశారు. ఇదిలా ఉంటే ఎం శ్రీనివాసులు రెడ్డి అన్న పేరుతో మట్టి తరలింపు అనుమతులు ఉన్న నేపథ్యంలో ఎంపీ పేరు అందులో ఉన్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై మొదలైన దుమారం రాజకీయ రంగు పులుముకుంది.
Recommended Video

సోమిరెడ్డి వ్యాఖ్యల్లో కూడా వాస్తవం లేదనేలా .. జలవనరుల శాఖ స్పష్టత
ఈ ప్రచారానికి ఊతమిస్తూ టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి తెలియకుండా ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచరులు ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి ఈ కేసులో ఆయనను ఇరికించే ప్రయత్నం చేశారని సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఈ వ్యవహారం మరింత దుమారంగా మారింది. మొత్తానికి జలవనరుల శాఖ క్లారిటీతో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పై ఎలాంటి కేసు నమోదు కాలేదని, మట్టి తరలింపు వ్యవహారంతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా వెల్లడైంది. ఇదే సమయంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా సత్య దూరమని ఎంపీ పేరే లేనప్పుడు ఎమ్మెల్యే ఇరికించారని చెప్పడంలో ఎలాంటి వాస్తవం లేదని స్థానికంగా చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications