డిజిటల్ మహానాడుపై స్పందించి వైసీపి.!సొంత డబ్బా తప్ప మరేం లేదన్న బొత్స.!
అమరావతి/హైదరాబాద్ : రెండు రోజులుగా జరిగిన తెలుగుదేశం పార్టీ డిజిటల్ మహానాడుపై అధికార వైసిపి ప్రభుత్వం స్పందించింది. టీడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై బురద జల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, అందుకే మహానాడు ఆత్మస్తుతి, పరనిందలా సాగింది అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. రెండేళ్లుగా చంద్రబాబు, ముఖ్యమంత్రిపై విమర్శలకే పరిమితం అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిజిటల్ మహానాడు మీద స్పందిస్తూ బొత్స కొన్ని ఆసక్తికర వాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట, కానీ ప్రజలను మేనేజ్ చేయలేరని పేర్కొన్నారు. 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు నైజం దోచుకోవడం, దాచుకోవడమేనని, మహానాడు ద్వారా చంద్రబాబు ప్రజల్లో అయోమయం సృష్టించేందుకు యత్నించారు తప్ప మరొకటి కాదని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.
Recommended Video
అంతే కాకుండా సీఎం జగన్ పాలన గురించి కూడా బొత్స స్పందించారు. ఒక కమిట్మెంట్తో, ఆలోచనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుకెళ్తున్నారని, కోవిడ్ నియంత్రణకు ప్రతిక్షణం శ్రమిస్తున్నారని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను 99 శాతం నేరవేర్చామని బొత్స స్పష్టం చేసారు. సంక్షేమ పథకాల ద్వారా లక్షా 20 వేల కోట్లను నేరుగా ప్రజలకే అందించామని, ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలనే చంద్రబాబు ప్రతయత్నిస్తున్నారని, ఆయన జూమ్ కార్యక్రమాలు హాస్యాస్పదంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. చంద్రబాబు హయాంలో ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి కాలేదని, పోలవరం ప్రాజెక్ట్ను కాంట్రాక్ట్లకు కట్టబెట్టి పూర్తిగా దోచుకున్నారని, చంద్రబాబు తప్పిదాల వల్లే పోలవరం పూర్తి కాలేదని ఘాటు విమర్శలు చేసారు. చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం వల్లే ప్రజలు తిరస్కరించారని, ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే వైసీపి చట్టాలు చేస్తోందని, ప్రతి చట్టంలోనూ సామాన్యుడికే మేలు జరిగేటట్లు తగు జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. చంద్రబాబు బెదిరింపులకు భయపడేది లేదని, రెండేళ్ల సీఎం జగన్ పాలన పట్ల ప్రజలు ఆనందంగా ఉన్నారని బొత్స స్పష్టం చేసారు.