కుప్పంలో వైసీపీ గేమ్ ప్లాన్ ఇదే!!
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి ఆయన వరుసగా ఏడుసార్లు జయకేతనమెగరవేశారు. ఈసారి ఎన్నికల్లో ఎట్టి పరిస్ఙితుల్లోను చంద్రబాబును కుప్పంలో ఓటమిపాలుచేయాలనే ఉద్దేశంతో అధికార వైసీపీ ఉంది. అందుకు అన్నిరకాలుగా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. చంద్రబాబును కుప్పంపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించేలా చేస్తే రాష్ట్రమంతటా దృష్టిపెట్టే అవకాశం తగ్గుతుందని, ఆ అవకాశాన్ని తాము ఉపయోగించుకొని రెండోసారి అధికారంలోకి రావచ్చనేది వైసీపీ పెద్దల ఆలోచనగా ఉంది.

బాధ్యతను తీసుకున్న పెద్దిరెడ్డి
కుప్పంలో బాబును ఓడించడానికి గతంలో ఆయనపై రెండుసార్లు పోటీచేసి ఓటమిపాలైన చంద్రమౌళి కుమారుడు భరత్కు సీటు ఇచ్చారు. నియోజకవర్గంలో బీసీల ప్రాబల్యం ఎక్కువ. బీసీ ఓటుబ్యాంకును గుంపగుత్తగా చేజిక్కించుకోవడంద్వారా బాబును ఓడించాలనేది ముఖ్యమంత్రి జగన్ ఆలోచనగా ఉంది. నియోజకవర్గం మొత్తం బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. పెద్దిరెడ్డి సోదరుడి కుమారుడు సుధీర్రెడ్డి నియోజకవర్గ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. భరత్ కు ఎమ్మెల్సీ ఇవ్వడంతో సుధీర్రెడ్డి పోటీచేస్తారని అందరూ భావించారు. అయితే కార్యకర్తల సమావేశంలో భరత్ పేరును ముఖ్యమంత్రి ప్రకటించారు.

యువకుడి చేతిలో బాబు ఓడించాలి
40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబును ఒక యువకుడి చేతిలో ఓడించాలనే యోచన సీఎం చేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా ప్రణాళికలను అమలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో బలమైన నాయకత్వాన్ని వైసీపీలో చేర్చుకున్నారు. దీని ఫలితం స్థానిక సంస్థల ఎన్నికల్లో కనపడింది. నియోజకవర్గం మొత్తం మీద గతంలో ఎక్కడెక్కడి నుంచి ఏయే వార్డుల నుంచి ఎక్కువ ఓట్లు చంద్రబాబుకు పడ్డాయి? అక్కడ ఓటర్లను సమీకృతం చేసే నాయకుడెవరు? నియోజకవర్గపరిధిలోని ఏయే గ్రామాల్లో తెలుగుదేశం పార్టీకి పట్టుంది? స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పడిన ఓట్లు ఎక్కడి నుంచి పోలయ్యాయి? అక్కడ వైసీపీ బలం పెంచాలంటే ఏం చేయాలి? ఎన్నికల్లో ఇక్కడ చంద్రబాబు ప్రచారం చేయకపోయినా వ్యవహారాలను పర్యవేక్షించే నేతలెవరు?.. తదితర వివరాలన్నింటినీ ముఖ్యమంత్రి జగన్ తెప్పించుకున్నారని, వీటిని క్రోడీకరించి మంత్రి పెద్దిరెడ్డితో చర్చించి అందుకనుగుణంగా ప్రణాళికను అమలు చేస్తారని తెలుస్తోంది.

నేను చేయగలిగినదంతా చేశాను..
రానున్న ఎన్నికలకు సంబంధించి మొదటి టికెట్ గా కుప్పం నుంచి భరత్ పేరును ప్రకటించానని, నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించానని, తాను చేయగలిగిందంతా చేశానని, గెలిపించాల్సిన బాధ్యత మాత్రం మీపైనే ఉందంటూ ముఖ్యమంత్రి జగన్ నియోజకవర్గ నేతలకు ఖరాఖండిగా చెప్పేశారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని, కుప్పం గెలవగలిగితే రెండోసారి వైసీపీ అధికారంలోకి వచ్చినట్లేనని ఆయన వారికి ఉద్బోధించారు.












Click it and Unblock the Notifications