'పవనిజం' టి షర్ట్తో వచ్చాడని కొట్టారు! ప్రజల ఆందోళన
నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో బుధవారం ఓ యువకుడు పవనిజం అని రాసి ఉన్న టి షర్ట్ ధరించి పోలిగ్ కేంద్రంలోకి రావడంతో ప్రత్యర్థులు అతనిని చితకబాదారు. ఆయనను కొట్టిన వారు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వారిగా ఆరోపిస్తున్నారు. బుధవారం సీమాంధ్రవ్యాప్తంగా పదమూడు జిల్లాలో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.
ఈ పోలింగ్ సందర్భంగా చాలాచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలోని ఓ గ్రామంలో వంశీ అనే యువకుడు ఓటు వేసేందుకు వచ్చాడు. అతని టి షర్ట్ పైన పవనిజం అని ఉంది. దీనిని గుర్తించిన ప్రత్యర్థి పార్టీ నాయకులు.. ఆ టి షర్ట్ వేసుకొని పోలింగ్ బూత్ వద్ద ప్రచారం చేస్తున్నాడని ఆరోపిస్తూ కొట్టారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సమాచారం తెలుసుకొని వచ్చిన పోలీసులు.. అతనితో పాటు స్నేహితులను కూడా స్వల్పంగా లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటన పైన పలువురు స్థానికులు మండిపడ్డారు. తమ పైన దాడికి పాల్పడ్డ పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారు ఓ దశలో పోలింగ్ను బహిష్కరించాలని భావించారు. అయితే ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు తగ్గారు.
కాగా, నెల్లూరు జిల్లాలో బుధవారం జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు స్వల్ప సంఘటనలు మినహా ప్రశాంతంగా సాగాయి. ఎక్కడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. అక్కడక్కడ జగన్ పార్టీ, టిడిపి కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. ఘర్షణకు దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.