రఘురామ వీడియో: వైఎస్సార్ సొంత పార్టీపైనా నిరసనగళం: విమర్శకులపై కక్ష తీర్చుకోలేదు..
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు లోక్సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు.. చాలా రోజుల తరువాత సోషల్ మీడియా ముందుకొచ్చారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్పై ఓ వీడియోను పోస్ట్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సొంత పార్టీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇదివరకు రోజూ సోషల్ మీడియాలో కనిపించిన ఆయన.. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు తెర వెనక్కి వెళ్లారు. అయినప్పటికీ- వైఎస్ జగన్కు రోజూ లేఖలు రాస్తూ వార్తల్లో నిలుస్తోన్నారు.
రైల్వేలో విప్లవాత్మక మార్పు: ఇక అర్ధరాత్రి దాకా కార్యాలయాలు: రెండు షిఫ్టులుగా విభజన
తాజాగా- ఆయన తెరమీదికి వచ్చారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని గురువారం రాత్రి ఓ వీడియోను పోస్ట్ చేశారు. వైఎస్సార్కు నివాళి అర్పించారు. ఆయన హయాంలో అమల్లోకి వచ్చిన సంక్షేమ పథకాల గురించి ప్రస్తావించారు. విద్య, వైద్యం, వ్యవసాయం ప్రధానంగా వైఎస్సార్ పరిపాలన సాగించారని చెప్పుకొచ్చారు. వైఎస్సార్ను మనసున్న మహరాజుగా అభివర్ణించారు.
వైఎస్సార్ మన మధ్య లేకపోయినా.. ప్రజల గుండెల్లో, తెలుగువారి హృదయాల్లో కొలువై ఉన్నారనడంలో సందేహాలు అక్కర్లేదని అన్నారు. ప్రజల నాడి తెలిసిన ఓ డాక్టర్గా మాత్రమే కాకుండా.. వారి నిజమైన అవసరాలు ఏమిటో తెలిసిన నేతగా పనిచేశారని అన్నారు. ప్రజలకు ప్రాథమిక అవసరాలైన విద్య, వైద్యం, రైతులకు సంబంధించిన సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇచ్చారని రఘురామ చెప్పారు. డబ్బును వృధా చేయలేదని గుర్తు చేశారు.
ఎన్నో పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొచ్చారని, దాని ద్వారా ఆదాయాన్ని పెంచారని అన్నారు. రైతుల కోసం ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. రైతు లేనిదే మానవజాతికి మనుగడ లేదనే సందేశాన్ని వైఎస్సార్ దేశానికి చాటి చెప్పారని రఘురామ వ్యాఖ్యానించారు. ఉచిత విద్యుత్ పథకాన్ని దేశంలోనే మొట్టమొదటి సారిగా అమలు చేసి, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఒక మార్గదర్శకుడిగా నిలిచారని అన్నారు.
Recommended Video
కాంగ్రెస్ పార్టీలో ఉంటూ.. ఏదైనా తప్పు జరిగితే దాన్ని ఎత్తి చూపేవారని, నిరసన గళం వినిపించే వారని రఘురామ వ్యాఖ్యానించారు. తాను చేసిన విమర్శలపై ఎవరైనా కామెంట్లు చేస్తే.. నవ్వుతూ స్వీకరించే వారని రఘురామ చెప్పుకొచ్చారు. అంతే తప్ప తప్పులను ఎత్తి చూపిన వారిపై ఎలాంటి కక్షపూరిత చర్యలకు గానీ, ఆవేశంగా అనాలోచిత ప్రతీకారానికి గానీ దిగలేదని అన్నారు. ఆ మహానాయకుని స్ఫూర్తితో అందరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.