జగన్ కేబినెట్ శాఖల్లో మరో మార్పు-బుగ్గనకు గౌతంరెడ్డి శాఖలు-గవర్నర్ ఆమోదం
ఏపీలో ఐటీ, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, జౌళి శాఖల మంత్రిగా పనిచేస్తూ హఠాన్మరణం చెందిన మేకపాటి గౌతంరెడ్డి అప్పటి వరకూ నిర్వహించిన శాఖల్ని ఎవరికి అప్పగించాలనే దానిపై మల్లగుల్లాలు పడ్డ ప్రభుత్వం చివరికి వాటిని ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కు కేటాయిస్తూ నిర్ణయించింది.
దివంగత మేకపాటి గౌతంరెడ్డి గతంలో నిర్వహించిన ఐటీ, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి శాఖల్ని గతంలో ఆయన మరణం తర్వాత మత్సశాఖ మంత్రి సీదిరి అప్పలరాజుకు జగన్ తాత్కాలికంగా అప్పగించారు. కానీ ఇవన్నీ కీలక శాఖలే కావడంతో వాటిని దీర్ఘకాలంగా నిర్వహించడంలో ఇబ్బందులు తలెత్తకుండా తిరిగి వాటిని ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గవర్నర్ కు కూడా సమాచారం ఇచ్చారు. దీంతో ఈ మార్పుకు ఆమోదం తెలుపుతూ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేశారు.
Recommended Video
ఇప్పటికే ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వద్ద ఆర్ధికశాఖతో పాటు వాణిజ్యపన్నులు, శాసనసభా వ్యవహారాలు, ప్రణాళికా వ్యవహారాలు కూడా ఉన్నాయి. వీటికి అదనంగా గౌతంరెడ్డి నిర్వహించిన ఐటీ, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి శాఖళు కూడా వచ్చి చేరాయి. దీంతో జగన్ కేబినెట్ లో ఆయన తర్వాత అత్యధిక శాఖలు నిర్వహిస్తున్న మంత్రిగా బుగ్గన రికార్డుల్లోకి ఎక్కబోతున్నారు. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందులతో సతమతం అవుతున్న నేపథ్యంలో బుగ్గనపై భారం పెరుగుతోంది. నెలలో సగం సమయం ఢిల్లీలోనే లాబీయింగ్ లోనే గడపాల్సి వస్తోంది. ఇప్పుడు తాజాగా మరిన్ని శాఖల్ని కేటాయించడంతో వాటి వ్యవహారాల్ని ఆయన ఎలా నిర్వహిస్తారన్న దానిపై చర్చ జరుగుతోంది.