వైసీపీ ఓటమికి కారణాలు ఇవేనట.. ఇంకా జ్ఞానోదయం కాకుంటే ఎలా జగన్?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలలో ఏపీ ప్రజలు అనూహ్య తీర్పునిచ్చారు. తెలుగుదేశం పార్టీ కూటమికి ఏకపక్ష విజయాన్ని కట్టబెట్టారు. మొత్తం రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలలో గత ఎన్నికలలో 151 స్థానాలు వైసిపి ఖాతాలో వేసుకోగా ఈసారి అదే బాటలో టిడిపి కూటమి ఖాతాలో మెజార్టీ స్థానాలు పడుతున్నాయి. ఇక ఎన్నికల ఫలితాల పైన వైసిపి అభ్యర్థులు వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి తదితరులు షాక్ కు గురయ్యారు.
ఏపీలో ఓటర్ల తీర్పుకు వైసీపీ షాక్
సంక్షేమ పథకాలు అందించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన వైసీపీని ప్రజలు ఆదరించకపోవడం ఏమిటి అన్నది ప్రస్తుతం వైసీపీ శ్రేణుల్లో చర్చకు కారణంగా మారింది. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాలలోనూ వైసిపి ఓటమిపాలైంది, అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి గల కారణాలను ప్రజల్లో వైసిపి పట్ల చోటుచేసుకున్న వ్యతిరేకతను ఈ సమయంలో కూడా అంచనా వేయలేకపోతుందన్నది తాజాగా వారు చేస్తున్న వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది.

ఓటమి కారణాలను చెప్తున్న వైసీపీ
వైసిపి ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తున్న వైసీపీ నేతలు మూడు పార్టీలు ఒక తాటి మీదికి వచ్చి పోటీ చేయడమే వైసిపి పరాజయానికి ప్రధాన కారణం అని భావిస్తున్నారు. ఇక ఇదే సమయంలో కూటమి ఇచ్చిన హామీలు వైసిపి ఇవ్వకపోవడం వల్ల, అమలు చేయలేని హామీలను ఇవ్వని క్రమంలోనే ప్రజల మద్దతు తమ వైపు లేదని చెబుతున్నారు.
ప్రతిపక్షాల విమర్శలు తిప్పి కొట్టలేకనే అంటున్న వైసీపీ నేతలు
ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కూటమి చేసినటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టలేక పోవడం కూడా ప్రజల మద్దతు పోగొట్టుకోవడానికి ఒక కారణమని భావిస్తున్నారు. సచివాలయాలు ఏర్పాటు చేసి లక్షన్నర ఉద్యోగాలు ఇచ్చామని చెబుతూ ఉద్యోగాలు ఇవ్వలేదన్న విమర్శను కూడా దీటుగా ఎదుర్కోలేకపోయామని అదే ఓటమికి కారణం అంటున్నారు.
మూడు రాజధానుల అవరోధాలు కారణం
ఇక కరోనా సమయంలో అందించిన ప్రభుత్వ సాయాన్ని ఓట్లుగా మలుచుకోకపోవడం, ఎన్నికలవేళ కూడా సంక్షేమ పథకాలపై ఎక్కువ ఆధారపడటం, సంక్షేమ పథకాలు ఉన్న అందరికీ ఇవ్వాలని తాపత్రయం తప్పించి వాటిని ఓటు బ్యాంకుగా మలుచుకోలేకపోవడం కారణమని వైసిపి నేతలు చెబుతున్నారు. మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో న్యాయపరమైన పరిధులు దాటలేక పోవడం కూడా వైసిపి ఓటమికి కారణం అంటున్నారు.
బిసి ఓటు బ్యాంకుకు అందుకే గండి
సామాజిక సమీకరణాలలో వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల బిసి ఓటు బ్యాంకు గండి పడిందని చెబుతున్నారు. ఎన్నికల ఓటమికి గల కారణాలను కూడా వైసిపి నేతలు కచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారని, ఇప్పటికి కూడా జ్ఞానోదయం రాకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు ఏపీ ఓటర్లు.
ఓటమికి కారణాలివి కాదా జగన్
ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా చేయడం, ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురాకపోవడం, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఏమీ చేయలేకపోవడం, ఏపీలో ప్రతి జిల్లాలోనూ వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రుల అరాచకాలు, కనీసం రోడ్లు కూడా బాగు చేయలేని దుస్థితిలో ఏపీ ప్రభుత్వం ఉండడం, ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలు వంటి అనేక కారణాలు వైసిపి ఓటమికి దోహదం చేశాయని ఈ విషయాన్ని గుర్తించలేకపోతే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజల ఆకాంక్షలు తెలుసుకొని రాజకీయాలు చేయాలని జగన్ కు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications