చంద్రబాబు ప్రభుత్వాన్ని కడిగేసిన వైయస్ జగన్
హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడిగిపారేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు రోజురోజుకు క్షీణించి పోతున్నాయని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతలపై చర్చ జరపడానికి 344 నిబంధన కింద నోటీస్ ఇచ్చామని స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుకు వైఎస్ జగన్ విజ్ఝప్తి చేశారు.
స్పీకర్ స్పందనకు సంతృప్తి చెందని వైఎస్ జగన్ - మనుషుల ప్రాణాలపై చర్చకన్నా మరో అంశమేమైనా ఉందా వైఎస్ జగన్ ప్రశ్నించారు. గత మూడు నెలల తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో జరుగుతున్న రాజకీయపరమైన దాడులు, హత్యలు ప్రజల్ని భయభ్రాంతులకు లోను చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
శాంతిభద్రతలపై చర్చ కోరడం తప్పా అంటూ సభలో ప్రభుత్వాన్ని నిలదీశారు. సభలో అన్ని అంశాలను చర్చించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకాల్సిన పరిస్థితి ఏర్పడిందని వైఎస్ జగన్ సభలో అన్నారు. మూడు నెలల తెలుగుదేశం ప్రభుత్వం పాలన జరుగుతున్న హత్యల గురించి చర్చించాల్సిన అవసరముందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
శాంతి భద్రతలపై చర్చించడానికి ఎందుకు పారిపోతున్నారు.. సభలో చర్చ జరగాల్సిందే అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న సమయంలో వైఎస్ జగన్ పై అధికారపక్షానికి చెందిన సభ్యులు ఎదురుదాడికి ప్రయత్నించారు.