లక్షకోట్లు: టీడీపీకి జగన్ ఆఫర్, పరిటాల రవి హత్యపై...
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి బిగ్ ఆఫర్ ఇచ్చారు! తన వద్ద లక్ష కోట్లు ఉన్నాయని టీడీపీ నేతలు పదేపదే ఆరోపిస్తున్నారని, తన దగ్గర అంత డబ్బు ఉంటే.. పది శాతం తనకు ఇచ్చి మిగతాది టీడీపీ నేతలు తీసుకోవచ్చునన్నారు.
తనకు సంబంధం లేని పరిటాల రవి హత్య కేసులో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, పరిటాల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న జేసీ బ్రదర్స్ను టీడీపీలో ఎందుకు చేర్చుకున్నారని ప్రశ్నించారు. బడ్జెట్లో రుణమాఫీకి లక్ష కోట్లు కేటాయించాలని వైయస్ జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రుణమాఫీకి లక్ష కోట్లు కేటాయించకపోతే ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు.
సభలో జగన్...
ఓసారి సభ వాయిదా పడి తిరిగి ప్రారంభమైనప్పుడు జగన్ మాట్లాడారు. మూడు నెలల్లో 11 మంది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలను కిరాతకంగా చంపేశారని ఆరోపించారు. ఈ విషయంలో ఏ చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని అడిగితే, తమకు సమాధానం ఏమీ లభించలేదన్నారు. హత్యకు గురైన వ్యక్తుల కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనలతో బతుకుతున్నారన్నారు.
మూడేళ్లలో విజయవాడ నుండి: నారాయణ
త్వరలోనే అన్ని శాఖల అధిపతులను విజయవాడకు తరలిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పి నారాయణ వేరుగా తెలిపారు. మూడేళ్లలో పాలన మొత్తం విజయవాడ నుంచే సాగుతుందన్నారు. ఈ నెల 27న రాజధాని ఎంపికపై ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇస్తుందని, రాజధాని నిర్మాణ శైలిని పరిశీలించేందుకు త్వరలోనే అహ్మదాబాద్, భువనేశ్వర్, రాయ్పూర్ పర్యటిస్తామన్నారు.