ఎన్నికల యుద్దంలో జగన్ కీలక అడుగు..!!
ఏపీలో ఎన్నికల సమరం హోరా హోరీగా సాగుతోంది. ప్రచారం పతాక స్థాయికి చేరింది. ఈ నెల 18వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి జగన్ సిద్దం బస్సు యాత్ర లో కీలక ఘట్టం ప్రారంభం అవుతోంది. విజయవాడలోకి ఈ రోజు జగన్ బస్సు యాత్ర ప్రవేశిస్తోంది. కూటమి నేతలు భారీగా ఆశలు పెట్టుకున్న ఉమ్మడి క్రిష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో జగన్ ఎంట్రీ ఇస్తుండటంతో ఎన్నికల రాజకీయం మరింత ఆసక్తి కరంగా మారుతోంది.
విజయవాడలోకి యాత్ర
ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్ర నేడు గుంటూరు జిల్లాలో పూర్తయి విజయవాడలోకి ప్రవేశిస్తోంది. మంగళగిరి బైపాస్ మీదగా సీకే కన్వెన్షన్ వద్దకు చేరుకుని చేనేత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కుంచనపల్లి బైపాస్ మీదగా తాడేపల్లి బైపాస్కు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు.

అనంతరం వారధి, శిఖామణి సెంటర్, చుట్టుగుంట, భగత్ సింగ్ రోడ్ , పైపుల రోడ్, కండ్రిక, రామవరప్పాడు, నిడమానూరు బైపాస్ మీదుగా కేసరపల్లి బైపాస్ శివారులో రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. మూడు పార్టీల కూటమి నేతలు గుంటూరు నుంచి విశాఖ వరకు మెజార్టీ సీటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
కూటమి కంచుకోటలపై గురి
ఉమ్మడి క్రిష్ణా, ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల్లో కూటమి వర్సస్ వైసీపీ కి వచ్చే సీట్ల పైన సర్వే సంస్థలు ఆసక్తి కర ఫలితాలు వెల్లడిస్తున్నాయి. 2019 ఎన్నికల ఫలితాలను రిపీట్ చేయాలనేది జగన్ లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే, ప్రస్తుత సమీకరణాల్లో మార్పు కనిపిస్తోంది. విజయవాడ నగరంలోని మూడు నియోజకవర్గాల్లో పశ్చిమం సీటులో బీజేపీ, మిగిలిన రెండు నియోజకవర్గాల్లో టీడీపీ పోటీలో ఉంది.
అవనిగడ్డ తో పాటుగా మచిలీపట్నం ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో సామాజిక - రాజకీయ సమీకరణాలు తమకు కలిసి వస్తాయని కూటమి అంచనా వేస్తోంది. ఇదే సమయంలో జగన పలువురు అభ్యర్దులను మార్చి కొత్త వ్యూహం అమలు చేస్తున్నారు.

జగన్ నిర్ణయాల పై ఆసక్తి
ఈ నెల15న పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్ యాత్ర ప్రవేశించనుంది. అదే రోజు భీమవరం లో సభలో పాల్గొంటారు. గోదావరిలో పవన్ ఫ్యాక్టర్ కీలకంగా మారుతోంది. ఈ సారి గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు రాకుండా చేస్తామని పవన్ ప్రకటించారు. పశ్చిమ గోదావరిలో అభ్యర్దుల ఖరారు విషయంలో జగన్ సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇచ్చారు.
గోదావరిలో మెజార్టీ సీట్లు సాధించే పార్టీకే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందనే లెక్క ఉంది. కూటమి ఎక్కువగా ఆశలు పెట్టుకున్న ఈ జిల్లాల్లో జగన్ కు ఎన్నికల వేళ ఎలాంటి మద్దతు వస్తుంది...ప్రత్యర్ధి పార్టీలకు ఎలాంటి సంకేతాలు పంపుతారు...జిల్లాల్లో సమీక్ష వేళ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications