జగన్ సర్కార్ పై వ్యతిరేకత నిజమే-షాకింగ్ రీజన్ ఇదే- సీనియర్ మంత్రి కామెంట్స్!
ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు కావస్తోంది. మరో 18 నెలల్లో తిరిగి అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కోవాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత తీవ్రంగా ఉందని విపక్షాలు నిత్యం గగ్గోలు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో స్వయంగా జగన్ కేబినెట్లోని సీనియర్ మంత్రి ఒకరు ఈ విషయాన్ని నిర్ధారించారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉన్న మాట నిజమేనని, అయితే దీని వెనుక ఓ కీలక కారణం ఉందని ఆయన తెలిపారు. ఈ మాట అన్న సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్న ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేసారు. అయితే రాష్ట్రంలో ప్రజావ్యతిరేకత వెనుక ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు కూడా ఉన్నాయని ధర్మాన వ్యాఖ్యానించారు. అలాగే రాష్ట్రంలో రోడ్లపై ఏర్పడిన గోతులు తాము తవ్వలేదు కదా అని ధర్మాన ప్రజలనుద్దేశించి పేర్కొన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలు ప్రజలకు అర్దం కాకపోవడమే ప్రజావ్యతిరేకత వెనుక ఉన్న కారణమని రెవెన్యూ మంత్రి ధర్మాన వెల్లడించారు. అయితే దీన్ని ఎలా అధిగమిస్తారన్న విషయం మాత్రం ఆయన చెప్పలేదు. దీంతో రాష్ట్రంలో ప్రజావ్యతిరేకతను అధిగమించేందుకే సీఎం జగన్ గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టినట్లు అర్ధమవుతోంది. అయితే ఈ కార్యక్రమంలోనే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు చేదు అనుభవాలు తప్పడం లేదు. ఇవాళ వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు గడప గడపకు కార్యక్రమంలో ప్రజల నుంచి వ్యతిరేకత తప్పలేదు. దీంతో ధర్మాన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.