మిర్చి ధర పెంచిన కేంద్రం: క్యాష్ చేసుకుంటున్న జగన్, మరి పవన్ లేఖ...
కేంద్ర ప్రభుత్వం మిర్చి మద్దతు ధరను పెంచింది. జగన్ దీక్ష వల్లనే కేంద్రం ప్రభుత్వంలో చలనం వచ్చిందని సాక్షి రాసింది. పవన్ కల్యాణ్ లేఖ, ఖమ్మం ఆందోళనల మాటేమిటి...
హైదరాబాద్: కేంద్రం మిర్చి ధర పెంచడాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. తన దీక్ష కారణంగానే కేంద్రప్రభుత్వం దిగివచ్చి, మిర్చి మద్దతు ధరను పెంచిందని చెబుకుంటున్నారు.
జగన్ దీక్షతో కేంద్ర ప్రభుత్వంలో చలనం వచ్చిందంటూ వైయస్ జగన్కు చెందిన మీడియా ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. రైతుల సమస్యలను పరిష్కరించాలని, పంటకు గిట్టుబాటు ధరలు కల్పించాలంటూ జగన్ చేసిన రైతు దీక్షకు కేంద్ర ప్రభుత్వంలో చలనం వచ్చిందని రాసింది.
క్వింటా మిర్చికి కేంద్ర ప్రభుత్వం రూ.5 వేల మద్దతు ధర ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మిర్చికి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది.

రెండు రోజులు దీక్ష
మద్దతు ధరలను డిమాండ్ చేస్తూ ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలసత్వాన్ని, రుణమాఫీ మోసాన్ని నిరసిస్తూ వైయస్ జగన్ సోమ, మంగళవారాలు రెండు రోజుల పాటు గుంటూరు నల్లపాడు రోడ్డులోని మిర్చియార్డులో నిరాహారదీక్ష చేశారు.

ఆ దీక్షకే చలనం...
జగన్ రెండు రోజుల పాటు చేసిన దీక్షకే కేంద్ర ప్రభుత్వంలో చలనం వచ్చిందని సాక్షి మీడియా రాసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను కేంద్ర మంత్రులు రాధా మోహన్ సింగ్, ఎం. వెంకయ్య నాయుడు వెల్లడించారు. మద్దతు ధర పెంచడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 88,300 మెట్రిక్ టన్నులు, తెలంగాణలో 33,700 టన్నులు మిర్చిని కేంద్రం కొనుగోలు చేస్తుంది.

పవన్ కల్యాణ్ లేఖ..
మిర్చి రైతుకు క్వింటాల్ కు రూ.11 వేలు గిట్టుబాటు ధరను చెల్లించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వాలకు సూచించారు. ఈ మేరకు ఆయన ఓ లేఖను రాశారు. లేఖ ప్రతిని ఆయన మీడియాకు మంగళవారం నాడు విడుదల చేశారు. అయితే మిర్చి రైతుల కష్టాలకు పాలకులు కారణమనే అభిప్రాయాన్ని ఆ లేఖలో పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ లేఖ కూడా కేంద్ర ప్రభుత్వంపై పనిచేసిందని కూడా అనుకోవచ్చు.

ఖమ్మం మార్కెట్ యార్డులో...
మిర్చి రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదంటూ తెలంగాణలో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డులో ఆందోళన హింసాత్మకంగా మారింది. మిర్చి యార్డుపై దాడి జరిగింది. ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఈ ఆందోళన మరిన్ని ప్రాంతాలకు వ్యాపించే పరిస్థితి కూడా వచ్చింది. దీంతో కేంద్రం అప్రమత్తమై ఉండవచ్చునని భావిస్తున్నారు. దాడిని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపక్షాల కుట్రగా అభివర్ణించింది. ఏమైనప్పటికీ పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా మారిందనే విషయం తేలిపోయింది.

హరీష్ రావు ఇలా...
రాష్ట్ర ప్రభుత్వం మిర్చి రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర వ్యవసాయశాఖకు ప్రతిపాదనలు పంపిందని, ఇంకా కేంద్రం నుంచి స్పందన రాలేదని తెలంగాణ మార్కెటింగ్ శాఖ మంత్రి చెబుతూ వచ్చారు. దాంతో కేంద్రం మిర్చి రైతులను పట్టించుకోవడం లేదనే భావన కలిగే పరిస్థితి ఏర్పడింది. బహుశా ఇది కూడా కేంద్రంలో చలనం రావడానికి కారణం కావచ్చు.












Click it and Unblock the Notifications