సమైక్యమంటే..? నేను జైళ్లో ఉన్నా నిజాయితీగా: జగన్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం సమైక్యంపై వివరణ ఇచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన జగన్ 'సమైక్యమంటే.. అందులో తెలంగాణ ఉంటుంది. కోస్తాంధ్ర ఉంటుంది. రాయలసీమ ఉంటుంది.' అని చెప్పారు. సమైక్యాంధ్ర కోసం అందరు ఒక్కటి కావాల్సిన అవసరముందన్నారు. ఈ నెల 26వ తారీఖున హైదరాబాదులో సమైక్య శంఖారావానికి పోలీసులు అనుమతి ఇచ్చారని చెప్పారు. మూడు ప్రాంతాలకు న్యాయం జరిగేలా సమైక్య శంఖారావం ఉంటుందన్నారు.
సమైక్యాంధ్ర కోసం తనతో పాటు తమ పార్టీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తారని చెప్పారు. కోర్టు అడ్డంకుల వల్ల తనకు ఢిల్లీ వెళ్లే అవకాశం లేకుంటే తమ పార్టీ ఎంపీల ద్వారా తన రాజీనామా లేఖను పంపిస్తానని, రాజీనామా ఆమోదించాలని తాను స్పీకర్ మీరా కుమార్ను విజ్ఞప్తి చేస్తానని చెప్పారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ కుడి భుజం అయితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎడమ భుజమన్నారు.
వీళ్లంతా మనుషులేనని పైన దేవుడు ఉన్నాడన్నారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ గురించి తాను మాట్లాడటం మొదలు పెడితే పెంట మీత రాయి వేసినట్లే అన్నారు. సమైక్యానికి వైయస్సార్ కాంగ్రెసుతో పాటు మజ్లిస్, సిపిఎంలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయన్నారు. రేపు తమ పార్టీ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద ధర్నా చేస్తారని చెప్పారు.
జైల్లో ఉన్నా నిజాయితీగా రాజకీయం చేశా
ఎవరు ఎవరితో కుమ్మక్కు అయ్యారో అందరికీ తెలుసునని జగన్ అభిప్రాయపడ్డారు. తాను పదహారు నెలలు జైల్లో ఉన్నప్పటికీ నిజాయితీగా రాజకీయం చేశానన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బయట ఉండి ఎవరితో కుమ్మక్కయ్యారో తెలుసునన్నారు. విప్ జారీ చేసి ప్రభుత్వాన్ని టిడిపి కాపాడిన సందర్భం ఉందన్నారు.