విజయవాడ వీధుల్లో రణరంగం: తన్నుకున్న కాంగ్రెస్, బీజేపీ నాయకులు- కర్రలు, బాహాబాహి
దేశ రాజధానిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారిక నివాసం లోక్ కళ్యాణ్ మార్గ్ సమీపంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళనల ప్రభావం ఏపీలోనూ ప్రతిధ్వనించింది. దీనికి నిరసనగా విజయవాడలో బీజేపీ నాయకులు భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చి ధర్నా నిర్వహించారు. వారిని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో తీవ్రస్థాయిలో ఘర్షణ చెలరేగింది. నడిరోడ్డు మీద బాహాబాహికి దిగారు. కర్రలతో కొట్టుకునేంత వరకూ వెళ్లింది. దీంతో నగరంలో ఒక్కసారిగా రాజకీయ సెగలు రేగాయి.
కాంగ్రెస్ పార్టీ తీరును నిరసిస్తూ విజయవాడలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ తీశారు. ప్రధానమంత్రి నివాసం వద్ద కాంగ్రెస్ పార్టీ హింసాత్మక వాతావరణానికి కారణమైందంటూ ఆరోపించారు. రాహుల్ గాంధీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. పార్టీ భవనంలోకి దూసుకెళ్లడానికి ఎగబడ్డారు. పోలీసులు అడ్డుకున్నా లెక్క చేయలేదు.

ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చాయి. పార్టీ కార్యాలయం ముట్టడిని అడ్డుకోవడానికి ప్రయత్నించాయి. కాంగ్రెస్ నాయకులు ప్రతిఘటించడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది కాస్తా పరస్పర తోపులాటకు దారితీసింది. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరినొకరు నెట్టుకుంటూ భౌతిక దాడులకు దిగారు. పార్టీ జెండాలను పట్టుకున్న కర్రలతో పరస్పరం కొట్టుకున్నారు. బాహాబాహికి దిగారు. దీంతో విజయవాడ వీధులు రణరంగంగా మారాయి.
పరిస్థితి చేజారిపోతుండటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న విజయవాడ నగర పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. ఘర్షణ పడుతున్న ఇరు పార్టీల నాయకులను, కార్యకర్తలను విడదీసేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. గొడవ మరింత పెరగకుండా నిరసనకారులను బలవంతంగా చెదరగొట్టారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రస్తుతానికి విజయవాడలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని నగర పోలీసు అధికారులు ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ కార్యాలయాల వద్ద అదనపు పోలీసు బలగాలను మోహరించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటంలో భాగంగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి నివాస ముట్టడికి యత్నించిన విషయం తెలిసిందే.
#WATCH | Andhra Pradesh | BJP workers staged a protest in Vijayawada condemning the Congress party's demonstration held near the official residence of the Prime Minister in Delhi.
— ANI (@ANI) July 22, 2026
Raising slogans of "Rahul Gandhi Down Down," BJP leaders and workers marched to the Congress party… pic.twitter.com/X5MN8A2ZbT
దీనికి ప్రతిచర్యగా దేశవ్యాప్తంగా బీజేపీ నిరసనలకు పిలుపునిచ్చింది. ప్రధాని కార్యాలయం వద్ద కాంగ్రెస్ చౌకబారు రాజకీయాలు చేస్తోందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. వాటి తీవ్రత ఏపీ రాజకీయాల్లో కూడా తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. ఇలా నడిరోడ్డు మీద కొట్టుకునే స్థాయికి వెళ్లాయి. ఏపీలో కోల్పోయిన పూర్వ వైభవాన్ని తిరిగి దక్కించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ తరుణంలో ఢిల్లీలో చోటు చేసుకుంటోన్న పరిణామాలను అనుకూలంగా మలచుకుంటోంది.












Click it and Unblock the Notifications