పాకిస్తాన్ కు వద్దన్నా నీటిని విడుదల చేస్తోన్న కేంద్రం- ఫ్లాష్ ఫ్లడ్స్ దెబ్బకు
కొద్దిరోజులుగా జమ్మూ కాశ్మీర్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫ్లాష్ ఫ్లడ్స్ సంభవిస్తోన్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. పర్వతాల నుంచి బురదతో కూడిన వరద ప్రవాహం ముంచెత్తుతోంది. ఈ పరిస్థితులను దృష్టి పెట్టుకుని ఇప్పటికే అక్కడ అమర్ నాథ్ యాత్ర రద్దయింది. వైష్ణో దేవి అమ్మవారి ఆలయానికీ రాకపోకలు బంద్ అయ్యాయి. ఈ రెండు యాత్రలకు వెళ్లిన వేలాదిమంది భక్తులు బేస్ క్యాంప్ లల్లో తలదాచుకుంటోన్నారు.
ఈ వర్షాల కారణంగా అక్కడి రిజర్వాయర్లన్నీ కూడా నిండుకుండల్లా తయారయ్యాయి. గరిష్టస్థాయి నీటి మట్టాన్ని దాటేశాయి. ఎగువప్రాంతాల నుంచి వరద నీరు భారీగా రిజర్వాయర్లకు చేరుకుంటోంది. రియాసి జిల్లాలోని సలాల్ రిజర్వాయర్, కిష్త్వార్ జిల్లాలోని దుల్హాసీ డ్యామ్, రాంబన్ జిల్లాలోని బగ్లిహార్ ఆనకట్టలకు లక్షల క్యూసెక్కుల కొద్దీ వరద పోటెత్తుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆయా రిజర్వాయర్ల గేట్లన్నింటినీ ఎత్తేశారు అధికారులు.

కొండ ప్రాంతాలలో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల వల్ల చీనాబ్ నదీ పరివాహక ప్రాంతాల్లో వరద తాకిడి విపరీతంగా పెరిగింది. సలాల్ ప్రాజెక్ట్ నుంచి భారీగా నీటిని విడుదల చేస్తుండటంతో చీనాబ్ నది దిగువ ప్రాంతాలలో నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. నదీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలలో నివాసం ఉంటున్న వారు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
వాతావరణంలో చోటుచేసుకున్న ఆకస్మిక మార్పుల వల్ల ఆ ప్రాంతంలో నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనివల్ల నదులు, ఉపనదులలో ప్రవాహం ఏ క్షణమైనా మరింత ఉధృతంగా మారే అవకాశం ఉందని స్థానిక అధికారులు అంచనా వేస్తోన్నారు. ఈ నేపథ్యంలోనే జలవనరుల శాఖ, స్థానిక విపత్తు నిర్వహణ బృందాలు నదీ తీర ప్రాంతాలలో నీటిమట్టాలపై నిరంతరం నిఘా ఉంచి పరిస్థితులను సమీక్షిస్తున్నారు.
VIDEO | Jammu and Kashmir: All gates of the Salal Dam have been opened following heavy rainfall in Reasi and nearby areas.
— Press Trust of India (@PTI_News) July 22, 2026
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/wlxLzFRHQg
అటు రాజౌరి, కిష్తవార్ జిల్లాలో కూడా భారీ వర్షాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా స్థానిక యంత్రాంగం, రాజౌరి పోలీసులు ఉమ్మడిగా భద్రతా మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈ వర్షాల వల్ల పర్వత ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని, అలాగే లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని ప్రజలను హెచ్చరించారు.
ఈ నీరు మొత్తం కూడా పాకిస్తాన్ కు చేరుతుంది. సింధు జలాల ఒప్పందంలో చీనాబ్ నది కీలకం. ఈ ఒప్పందం పరిధిలోకి వచ్చే చీనాబ్ నదిపై నిర్మించిన బగ్లిహార్ డ్యామ్ గతంలోనూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. సాగు నీటి అవసరాల కోసం పాకిస్తాన్ ఈ నది ప్రవాహంపైనే ఎక్కువగా ఆధారపడుతుంటుంది. 1960లో కుదిరిన సింధు జలాల ఒప్పందం ప్రకారం జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ నదుల నీటి వినియోగ హక్కులను భారత్, పాకిస్తాన్ మధ్య విభజించారు.
సరిహద్దుల్లో ఉగ్రవాద చర్యలకు పాక్ స్వస్తి పలికే వరకు ఈ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత్ గత ఏడాది ప్రకటించింది. అదే విధానాన్ని నేటికీ కొనసాగిస్తూ వస్తోంది. అయినప్పటికీ.. నీటి మట్టం భారీగా పెరగడంతో అదనపు జలాలను విడుదల చేయక తప్పట్లేదు.












Click it and Unblock the Notifications