SKOCH CM of the Year: జగన్ పాలనకు పట్టం: జనం రివార్డులే కాదు..బెస్ట్ సీఎం అవార్డు కూడా
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. మరో అరుదైన ఘనతను సాధించారు. ఇప్పటిదాకా వివిధ శాఖలు, విభాగాలు అత్యుత్తమ పనితీరును కనపర్చినందుకు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డును అందుకుంటూ వచ్చిన ఆయన ప్రభుత్వం.. ఈ సారి మరో ముందడుగు వేసింది. మరో అత్యుత్తమ అవార్డును అందుకుంది. అత్యుత్తమ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ గుర్తింపు పొందారు. బెస్ట్ చీఫ్ మినిస్టర్గా స్కోచ్ అవార్డులను ఆయన అందుకున్నారు.
ఒక ఏడాది పొడవునా ముఖ్యమంత్రి అందజేసిన పరిపాలనను గీటురాయిగా తీసుకుని.. స్కోచ్ గ్రూప్ సంస్థ ఈ అవార్డులను అందజేస్తుంటుంది. ప్రమాణ స్వీకారం చేసిన ఏడాదిన్నర కాలంలోనే స్కోచ్ నుంచి అత్యుత్తమ ముఖ్యమంత్రి అవార్డును అందుకోవడం ఇదే తొలిసారిగా భావిస్తున్నారు. స్కోచ్ గ్రూప్ సంస్థల ఛైర్మన్ సమీర్ కొచ్చర్.. కొద్దిసేపటి కిందట వైెఎస్ జగన్ను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ అవార్డును ఆయనకు అందజేశారు.

రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు, వైఎస్సార్ చేయూత, దిశ చట్టం, కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రాతిపదికగా తీసుకుని ఆయనకు ఈ అవార్డును అందజేసినట్లు స్కోచ్ గ్రూప్ ఓ ప్రకటనలో వెల్లడించింది. కరోనా వ్యాప్తి చెందుతోన్న కాలంలోనూ రాష్ట్రవ్యాప్తంగా 123 ప్రాజెక్టులను జగన్ సర్కార్ అమలు చేసిందని తెలిపింది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ కొన్ని సాహసోపేత నిర్ణయాలను తీసుకున్నారని పేర్కొంది.
ఇదివరకు వైఎస్ జగన్.. కొన్ని సంస్థలు చేపట్టిన సర్వేల్లో అత్యుత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో తొలి అయిదుమందిలో నిలుస్తూ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సారి ఆయన మరో అడుగు ముందుకేశారు. అత్యుత్తమ ముఖ్యమంత్రి అవార్డును అందుకున్నారు. Chief Minister of the Year అవార్డును సొంతం చేసుకున్నారు. దీనిపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తోన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు ప్రజా తీర్పును ప్రతిబింబిస్తోండగా.. అదే స్థాయిలో వైఎస్ జగన్ ఈ అవార్డును అందుకోవడం అరుదుగా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications