ఎమ్మెల్యేల ఫిరాయింపులతో గుబులు: జగన్ ఎమ్మెల్యేల లెక్క తేలిందా?
హైదరాబాద్: తనతో చివరి దాకా ఉండే శాసనసభ్యులు ఎంత మంది అనే విషయాన్ని తేల్చుకోవడానికే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారంనాడు సమావేశం ఏర్పాటు చేసినట్లు భావిస్తున్నారు. శాసనసభ్యులు ఒక్కరొక్కరుగా పార్టీని వీడుతుండడంతో ఆయన ఆత్మరక్షలో పడ్డారు.
పైగా, మార్చి 5 లోపు వైసీపీ ఖాళీ అవుతుందని, జగన్ తప్ప పార్టీలో ఎవరూ ఉండరని మంత్రులు పదేపదే చెబుతున్నారు. దీంతో జగన్కు గుబులు ప్రారంభమైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అసలు ఎంతమంది ఎమ్మెల్యేలు తనవైపు ఉన్నారో తేల్చుకునేందుకు జగన్ సిద్ధపడే సమావేశం ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు.
ఈ రోజు కార్టూన్
సోమవారంనాడు పార్టీ సమావేశానికి ఎంతమంది హాజరవుతారో వారే చివరగా మిగిలే ఎమ్మెల్యేలనే అభిప్రాయానికి వచ్చేందుకే జగన్ ఈ భేటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ కీలక భేటీగా జరిగిన ఈ సమావేశానికి ఏడుగురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. దీంతో పార్టీ వీడేవారెంత మందో, వారెవరో కనిపెట్టేసినట్టేనని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
సమావేశానికి 47 మంది శాసనసభ్యులు హాజరయ్యారు. ఎన్నికల్లో జగన్ సహా 67 మంది శాసనసభకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున విజయం సాధించారు. సమావేశానికి గైర్జాజరైన శాసనసభ్యులు తమ డుమ్మాకు వ్యక్తిగత కారణాలను సాకుగా చూపించారు.
ఆ ఏడుగురిపై ఒక కన్నేసి ఉంచాలని జగన్ మిగతా ఎమ్మెల్యేలకు సూచించినట్లు తెలిసింది. అయితే ఈ విషయంపై స్పష్టత తెచ్చుకున్న జగన్ మిగిలిన ఎమ్మెల్యేల అండతో ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టే దిశగా పావులు కదుపుతున్నారు. వైసీపీ అధినేత జగన్ పార్టీ ఎమ్మెల్యేందరితో సమావేశమై, ఈ అంశాన్నే ప్రధానంగా ప్రస్తావించినట్లు సమాచారం.
పార్టీ మారిన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయాలని వైసీపీ యోచిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పచ్చ కండువా కప్పుకుంటున్న నేపథ్యంలో స్పీకర్ను కలవాలని వైసీపీ నిర్ణయించారు. పార్టీ మారిన ఆరుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ను కోరాలని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు.
ఈ సమావేశానికి గైర్హాజరైన ఎమ్మెల్యేలు వీరే...
సుజయ కృష్ణ రంగారావు (బొబ్బిలి),మణిగాంధీ (కోడుమూరు), గౌరు సుచరిత (పాణ్యం), శివ ప్రసాద్ రెడ్డి(ప్రొద్దుటూరు), తిప్పేస్వామి(మదనపల్లి), బాల నాగిరెడ్డి (మంత్రాలయం), మేకపాటి గౌతమ్ రెడ్డి (ఆత్మకూరు).