పవన్ కళ్యాణ్ అనే మేధావి రాష్ట్రాన్ని ముంచారు, ఇప్పుడు గుర్తుకు వచ్చిందా: జగన్
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తన శ్రీకాకుళం జిల్లా పర్యటనలో పవన్ సీఎం చంద్రబాబు, జగన్, మోడీలపై విమర్శలు గుప్పించారు. తనపై విమర్శలు చేసిన జనసేనానికి వైసీపీ అధినేత కౌంటర్ ఇచ్చారు.
Recommended Video

పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి చెందిన సినిమాలో సినిమా తక్కువ, ఇంటర్వెల్ ఎక్కువ అని ఎద్దేవా చేశారు. సాధారణంగా మనం సినిమాకు వెళ్తే ఇంటర్వెల్ పది నిమిషాలు వస్తుందని, సినిమా రెండున్నర గంటలు ఉంటుందన్నారు. కానీ పవన్ సినిమాలో ఇంటర్వెల్ రెండున్నర గంటలు, సినిమా పది నిమిషాలు ఉంటుందన్నారు.

పవన్ కళ్యాణ్ అనే మేధావి, అప్పుడు అలా
ఈ నాలుగేళ్లలో పవన్ కళ్యాణ్లో మనం చూసింది ఇదేనని జగన్ ఎద్దేవా చేశారు. ఆయన మాట్లాడే మాటలను బట్టి, నువ్వు అడిగావు కాబట్టి నేను చెబుతున్నా ( ఓ విలేకరి ప్రశ్నకు సమాధానంగా) అంటూ జగన్ సమాధానం ఇచ్చారు. 2014లో ఇదే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, ఇదే మేధావి నాడు చంద్రబాబు-బీజేపీకి ఓటేయమని ప్రజలకు సలహా ఇచ్చారని గుర్తు చేశారు.

చంద్రబాబు చేసిన అన్యాయాల్లో పవన్ పాత్ర ఉంది
వారికి ఓటు వేయమని చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని ముంచారా లేదా అని జగన్ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ముంచిన విషయంలో పవన్ పాత్ర కూడా ఉందన్నారు. ప్రత్యేక హోదా ఒక్కటే కాదని, చంద్రబాబు చేసిన అనేక మోసాలు, అన్యాయాలు, అబద్దాల్లో ఈయనకు కూడా భాగస్వామ్యం లేకుండా పోతుందా అని నిలదీసారు. వారికి మద్దతిచ్చేందుకు ఊరూరో తిరిగాడన్నారు. వారికి ఓట్లు వేయించాడన్నారు.

తన పార్టీ లాభం కోసం ఇప్పుడు విమర్శలు
ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్, ఇదే మేధావి.. చంద్రబాబు, బీజేపీ ముంచేశారని చెబుతున్నారని జగన్ విమర్శించారు. ఆ రోజు పవన్ వారికి ఓటు వేయమని చెప్పి అడిగి రాష్ట్రాన్ని ముంచారన్నారు. ఈ రోజు ఈయనే, నాలుగేళ్ల తర్వాత, ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో తనది కొత్త పార్టీ కాబట్టి రాజకీయంగా తాను లాభపడేందుకు, ఉనికి కోసం ఈ రోజు ఇదే వ్యక్తి బీజేపీని, చంద్రబాబును విమర్శిస్తున్నారన్నారు.

పవన్ కళ్యాణ్ ఏం చెప్పారంటే?
కాగా, వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలోని కొనసాగుతోంది. కాగా, శ్రీకాకుళం జిల్లా పర్యటనలో మాట్లాడుతూ.. వైసీపీ ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి వెళ్లకపోవడం తప్పని వ్యాఖ్యానించారు. అలాగే, నేను సీఎం అయితేనే అన్నీ చేస్తాననే అభిప్రాయం తనకు లేదని జగన్ను ఉద్దేశించి అన్నారు. దీనికి వైసీపీ అధినేత కౌంటర్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications