ఐఏఎస్ శ్యాంబాబుకు ఊరట..!: జగన్ అక్రమాస్తుల కేసు వీగిపోనుందా?
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైయస్ జగన్పై దాఖలైన అక్రమాస్తుల కేసుకు సంబంధించి హైకోర్టు బుధవారం సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి (ఏపీ కేడర్) శ్యాంబాబుకు బుధవారం హైకోర్టులో ఊరట లభించింది.
అనంతపురం జిల్లాలోని లేపాక్షి నాలెడ్జ్ హబ్కు భూములు కేటాయింపు కేసులో ఆయనపై కొనసాగుతున్న విచారణను నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇళంగో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
వివరాల్లోకెళితే... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన సమయంలో శ్యాంబాబు అనంతపురంలో లేపాక్షి నాలెడ్జ్ హబ్కు పెద్ద ఎత్తున భూములు కేటాయించారని ప్రతిఫలంగా ఆ సంస్ధ జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిందని సీబీఐ అభియోగాలు మోపింది.

ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన సీబీఐ చార్జిషీటు కూడా దాఖలు చేసింది. ప్రస్తుతం ఈ కేసు నాంపల్లి కోర్టు ఆవరణలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ కొనసాగుతోంది. అయితే తనపై సీబీఐ తప్పుడు ఆరోపణలు చేస్తోందని హైకోర్టును ఆశ్రయించిన శ్యాంబాబు, తనపై జరుగుతున్న విచారణను నిలిపివేయాలని కోరారు.
దీనిపై బుధవారం జరిగిన విచారణ సందర్భంగా శ్యాంబాబు తరపు న్యాయవాది సుదీర్ఘ వాదనలు వినిపించారు. ఆల్ ఇండియా సర్వీసుకు చెందిన అధికారిని విచారించాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని, కానీ శ్యాంబాబును విచారించేందుకు అటు కేంద్రంతో పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనుమతివ్వని అంశాన్ని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
2005-10 పారిశ్రామిక విధానం ప్రకారం అధికారులు నాలెడ్జ్ హబ్ తో మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్ చేసుకున్నారని, దానిని రాష్ట్ర కేబినెట్ కూడా ఆమోదించిందని తెలిపారు. అంతేకాదు ప్రాసిక్యూషన్కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరాకరించాయని, పిటిషనర్పై ఇంకా విచారణ కొనసాగించడం చట్టాలను దుర్వినియోగం పరచడమేనని తెలిపారు.
ఈ వాదనతో ఏకీభవించిన జస్టిస్ రాజా ఇళంగో, శ్యాంబాబుపై జరుగుతున్న విచారణను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్వర్వులు జారీ చేశారు.












Click it and Unblock the Notifications