జగన్ ఆరోగ్యంపై ఆందోళన, ప్రభుత్వం ఆరా: హైద్రాబాద్ ఏపీ విద్యార్థుల పిలుపు
గుంటూరు/హైదరాబాద్: ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ గుంటూరు జిల్లా నల్లపాడులో దీక్ష చేస్తున్న వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్కు వివిధ పార్టీలకు చెందిన నేతలు, ప్రజా సంఘాలు మద్దతు పలుకుతున్నాయి. హైదరాబాదులోని వివిధ ఐఏఎస్ స్టడీ సర్కిల్స్లో సివిల్స్ పరీక్షల కోసం శిక్షణ తీసుకుంటున్న ఏపీ విద్యార్థులు కూడా మద్దతిచ్చారు.
ఇప్పటి వరకు జగన్ ఏం చేసినా విజయం సాధించారని, ప్రత్యేక హోదా విషయంలో కూడా విజయం సాధిస్తారని, ఆయనకు అందరూ మద్దతివ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా ఏపీకి అవసరమన్నారు. రాజధాని విషయం నుంచి ప్రతి విషయంలో ఏపీ చాలా నిర్మాణాలు చేపట్టవలసి ఉందన్నారు.
Photos: జగన్ దీక్ష
ఇవన్నీ ఒక ప్రత్యేక హోదాతోనే సాధ్యమని వారు అభిప్రాయపడ్డారు. బిజెపి కూడా ప్రత్యేక హోదా పైన హామీ ఇచ్చిందన్నారు. అన్ని రంగాల్లో ఉన్న ఏపీ.. విడిపోవడం వల్ల ఒక్కసారిగా వెనక్కి పోయిందన్నారు. కాగా, జగన్ దీక్ష ఆదివారం నాడు ఐదో రోజుకు చేరుకుంది.
ఇదిలా ఉండగా, జగన్ ఆరోగ్యం క్షీణిస్తోందని వైద్యులు చెప్పారు. ఆదివారం నాడు వైద్యులు ఆయనను పరీక్షఖించారు. జగన్ బరువు తగ్గి, నీరసించారని చెప్పారు. షుగర్ లెవల్స్ పడిపోయాయన్నారు. బీపీ 110/70గా ఉందని, పల్స్ రేట్ 66 ఉందని చెప్పారు. మధ్యాహ్నం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. కాగా, వైసిపి జగన్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది.
అయితే జగన్ దీక్ష ప్రారంభించిన తొలి రెండు రోజులూ తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసిన అధికార పార్టీ నాయకులు సైతం నాల్గవ రోజుకు దీక్ష చేరుకుని జగన్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో జరగబోయే పరిణామాలను గమనిస్తూ స్తబ్దుగా వ్యవహరిస్తున్నారు.
ప్రభుత్వం ఆరా తీస్తోందని తెలుస్తోంది. టిడిపి నాయకత్వం కూడా దీక్ష వలన రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిస్థితులపై స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా సమాచారం రాబడుతున్నట్లుగా చెబుతున్నారు.
పది సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా కావాలని రాజ్యసభలో వాదించిన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడటం లేదని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ఒకవేళ చట్టంలో లేకపోయినా నాటి హామీల ప్రకారం హోదా ఇచ్చే అవకాశం లేదా అని నిలదీశారు.