ఇన్నాళ్లూ రివర్స్!: వేడిరాజేసిన జగన్, చంద్రబాబుని కార్నర్ చేసేనా?
జంగారెడ్డిగూడెం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి జంగారెడ్డిగూడెంలో బుధవారం నిర్వహించిన బహిరంగ సభ విజయవంతమైంది. చాలా రోజుల తర్వాత జగన్ మరోసారి లైన్లోకి వచ్చారని అంటున్నారు.
జగన్ సభ కారణంగా.. రాజకీయ వేడి రాజుకుందని, ఇప్పుడప్పుడే ఎన్నికలు ఉన్న వాతారవణం కనిపిస్తోందని అంటున్నారు. వైసిపి ఎమ్మెల్యేలు, ఇతర నేతలు టిడిపిలోకి వెళ్లడం, అవిశ్వాస తీర్మానం, తదితర అంశాలలో జగన్కు రివర్స్ అయిన నేపథ్యంలో చాలా రోజుల తర్వాత జగన్ రాజకీయ వేడి రాజేశారని అంటున్నారు.
ఇదే దూకుడు కొనసాగిస్తే జగన్... ముఖ్యమంత్రి చంద్రబాబును ఇరుకున పెడతారని వైసిపి కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఏపీలో ప్రతిపక్షం హడావుడి కనిపించని విషయం తెలిసిందే. వైసిపి ఇప్పుడు గడపగడపకూ వైసిపి పేరుతో కార్యక్రమం నిర్వహిస్తోంది.
జగన్
రాష్ట్రంలో రైతులు పండించే అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర లభించడానికి వీలుగా రూ.5000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తానని గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ ఏమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ ప్రశ్నించారు.
జగన్
నాడు తాను మూడువేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానంటే, చంద్రబాబు ఐదువేల కోట్లతో ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారని గుర్తుచేశారు.
జగన్
అధికారంలోకి వచ్చాక ధరల స్థిరీకరణ నిధి మాటెత్తడంలేదని ధ్వజమెత్తారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో బుధవారం నిర్వహించిన రైతు భరోసా యాత్రలో భాగంగా జగన్ పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి ఆయన మాట్లాడారు.
జగన్
తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో వరి రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి వచ్చిందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికే ముగ్గురు పొగాకు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, బ్యారన్కు ఏడు నుండి ఎనిమిది లక్షల రూపాయల పెట్టుబడి పెట్టిన రైతులకు నాలుగు లక్షల వరకు నష్టం వచ్చే రీతిలో పొగాకు ధరలు ఉన్నాయన్నారు.
జగన్
ఎన్ఎల్ఎస్ ఏరియాలో రైతులు 45 మిలియన్ కిలోలు పండిస్తే ఇప్పటి వరకు కేవలం 22 మిలియన్ కిలోలే కొనుగోలు చేశారని, వర్షాకాలం వచ్చేసినా నేటికీ కొనుగోళ్ళు పూర్తికానందున రైతుల వద్ద మిగిలిన పొగాకు రంగు మారిపోయి, నాసిరకం ధర మాత్రమే వస్తుందన్నారు.
జగన్
వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పొగాకు సరాసరి ధర కిలోకు రూ.165 వస్తే ఇప్పుడు కేవలం రూ.114 మాత్రమే వచ్చిందన్నారు.
జగన్
నాడు పామాయిల్ పండల ధర టన్ను పదివేలు ఉంటే నేడు రూ.7,400కు పడిపోయిందన్నారు. ముఖ్యమంత్రి పొగాకు పంటకు గిట్టుబాటు ధరలు ఇప్పించడానికి కేంద్రంపై వత్తిడి తేవాలని డిమాండ్చేశారు.
జగన్
రైతు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పొగాకు రైతులు ఇప్పుడు అతి దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారని చెప్పారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదన్నారు. రైతులు క్రాప్ హాలీడే ప్రకటిస్తున్నారన్నారు. వారికి హోంమంత్రి హెచ్చరికలు జారీ చేయడం విడ్డూరమన్నారు.
జగన్
రైతుల రుణాలు మాఫీ చేస్తానని ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పారన్నారు. రైతుల నుంచి ఇప్పుడు బ్యాంకులు అపరాధ రుణం వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు అపరాధ వడ్డీ కట్టడానికి చంద్రబాబు కారణం కాదా అన్నారు. ఈ పరిస్థితిని ఆయన తీసుకు రాలేదా అని ప్రశ్నించారు.
జగన్
ఇచ్చిన మాట పైన నిలబడనప్పుడు, ఆ రాజకీయ నాయకుడిని నిలదీసినప్పుడే రాజకీయ వ్యవస్థ మారుతుందన్నారు. ఈ రాజకీయ వ్యవస్థ మారాలన్నారు. నేను ఫలానా పని చేస్తానని ఓ రాజకీయ నాయకుడు చెప్పి ఓట్లు వేయించుకొని, ముఖ్యమంత్రి అయ్యాక, ఆ పనిని చేయనప్పుడు.. ఆయన సీఎంగా ఎలా చెల్లుబాటు అవుతారని ప్రశ్నించారు. ఇలా హామీలు ఇచ్చుకుంటూ పోతే ఇంకెవరైనా ప్రతి ఒక్కరికి విమానం, కారు కొనిస్తానని చెబుతారని ఎద్దేవా చేశారు.