చంద్రబాబు భయపెడుతున్నారు, దమ్మూ ధైర్యమూ ఉందా: జగన్
హైదరాబాద్: తాను చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన సమాధానంపై ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మంగళవారం శాసనసభలో ఆసక్తికరంగా స్పందించారు. చంద్రబాబు పెద్ద కళ్లు పెట్టుకుని, వేలు చూపుతూ బెదిరిస్తున్నారని, ఏం చేస్తారో తెలియదని, స్పీకర్ తన రక్షణకు రావాలని ఆయన అన్నారు. ఆ తర్వాత ప్రత్యేక హోదాపై తన ప్రసంగాన్ని కొనసాగించారు.
ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తారా, లేదా చెప్పాలని ఆయన చంద్రబాబును డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీకి గడువు పెట్టగలదా అని ఆయన అడిగారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తప్పుకుంటామని చెప్పి గడువు పెట్టగలరా అని ఆయన అడిగారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపసంహరించుకునే దమ్మూ ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ఆయన ప్రశ్నించరాు.
ప్రత్యేక హోదాను కోరుతూ ఆత్మహత్యలు చేసుకున్నవారికి సంతాపం ప్రకటిస్తూ వారి పేర్లను ప్రస్తావించకపోవడం సరి కాదని ఆయన అన్నారు. మరణించినవారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తామని ఇచ్చిన హామీని ఇప్పటి వరకు నిలబెట్టుకోలేదని ఆయన అన్నారు. ప్రత్యేక హోదాపై విభన్నమైన ప్రటనలు చేస్తూ చంద్రబాబు గందరగోళం సృష్టిస్తున్నారని, దానివల్లనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన అన్నారు.
ఆ తర్వాత కూడా శాసనసభలో ప్రత్యేక హోదాపై చర్చ కొనసాగించింది. ప్రతిపక్ష, అధికార పక్షాల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు.