వైయస్ జగన్కు తప్పిన ప్రమాదం: 20 నిమిషాలు వెయిట్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పింది. కర్నూలు నుంచి రోడ్డు మార్గంలో కారులో కాన్వాయ్తోపాటు హైదరాబాద్కు మంగళవారం వస్తున్న సమయంలో ఆ సంఘటన జరిగింది.
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని పాల్మాకుల వద్ద కారు టైరు పంక్చర్ అయింది. వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కకు వెళ్లిపోవడంతో డ్రైవర్ అప్రమత్తమై వెంటనే నిలిపేశాడు. భద్రతా సిబ్బంది కాన్వాయ్లో నుంచి దిగి జగన్కు రక్షణగా చుట్టూ నిలబడ్డారు.
కారు టైరు మార్చిన తర్వాత అందులోనే హైదరాబాద్కు బయలుదేరారు. జగన్ 20 నిమిషాలపాటు రోడ్డుపైనే వేచి ఉండడంతో భద్రతా సిబ్బంది అక్కడికి ఎవరినీ అనుమతించలేదు.
మంగళవారంనాడు వైయస్ జగన్ కర్నూలులో యువభేరీ కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ప్రత్యేక హోదాపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు.