జగన్ సమర్థతకు బీజేపీ పరీక్ష - నో కాంప్రమైజ్, హిస్టరీ రిపీట్..!!
ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. వైసీపీ లక్ష్యంగా కూటమి నేతలు వ్యూహాలు అమలు చేస్తున్నారు. కూటమి పార్టీల్లోనూ లెక్కలు మారుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తూనే.. సొంతంగా బలోపేతం కావటం పైన ఫోకస్ చేసింది. ఇందు కోసం కొత్త స్కెచ్ సిద్దం చేసింది. దశల వారీగా ప్లాన్ అమలుకు సిద్దం అవుతోంది. ఈ పరిస్థితులు జగన్ సమర్ధతకు పరీక్షగా మారుతున్నాయి. పార్టీ ఆవిర్బావ వేళ చోటు చేసుకున్న పరిస్థితులు రిపీట్ అవుతున్నట్లు కనిపిస్తోంది. మరి.. జగన్ ఏం చేయబోతున్నారు...ఎలా ఎదుర్కొంటారు..
మారుతున్న లెక్కలు
ఏపీలో ప్రస్తుతం జగన్ లక్ష్యంగా రాజకీయం సాగుతోంది. ఏపీలో కూటమిలో ఉన్న బీజేపీ, జనసేన వచ్చే ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాయి. ముందుగా వైసీపీ పైన కూటమి పార్టీలు గురి పెట్టాయి. తాజా ఎన్నికల్లో జగన్ పార్టీ దాదాపు 40 శాతం ఓట్లను దక్కించుకుంది. ఇక, మూడు పార్టీలుగా కలిసి పోటీ చేసిన కూటమి నేతలు తాజా రాజకీయ సమీకరణాలతో అప్రమత్తం అవుతున్నారు. ప్రభుత్వం పైన క్షేత్ర స్థాయి నివేదికలను తెప్పించుకుంటున్నారు. సొంతంగా తాము ఎదగటానికి ..బలం పెంచుకోవటానికి ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు. అదే టైం లో వైసీపీని దెబ్బ తీసేందుకు చంద్రబాబు తన వ్యూహాలకు పదును పెట్టారు.

సమర్ధతకు పరీక్ష
వైసీపీ లో జగన్ తన వారిగా నమ్ముకున్న బాలినేని, సాయిరెడ్డి లాంటి వారు బయటకు వెళ్లారు. ఇతర మార్గాల్లోనూ జగన్ ను ఇబ్బంది పెట్టేలా ప్రయత్నాలు సాగుతున్నాయి. దీంతో, పార్టీ భవిష్యత్ పై కేడర్ లో డైలమా కనిపిస్తోంది. అదే సమయంలో జగన్ గత చరిత్ర.. పోరాటం గుర్తు చేసుకుంటున్న వారు తమ పార్టీ అధినేత పైనే నమ్మకంతో కనిపిస్తున్నారు. పార్టీ ఆవిర్భావం వేళ చోటు చేసుకున్న పరిణామాలను ప్రస్తావిస్తున్నారు. కానీ,అప్పుడు జగన్ తన చెల్లి, తల్లితో పాటు గా సాయిరెడ్డి వంటి వారు మద్దతు పూర్తిగా ఉంది. ఇప్పుడు వీరు దూరమయ్యారు. ఓటమి తరువాత పార్టీ నేతల పై కూటమి పార్టీలు గాలం వేస్తున్నాయి.
జగన్ నిర్ణయం
ఇక, ఇప్పుడు జగన్ ముందున్న ప్రత్యామ్నాయం ఏంటి. తాజాగా సాయిరెడ్డి నిర్ణయం వేళ జగన్ పార్టీ ముఖ్య నేతలతో చర్చలు చేసినట్లు సమాచారం. రాజకీయంగా ఎన్నో విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్న అంశాన్ని జగన్ గుర్తు చేసుకుంటున్నారు. అధికారంలో ఉన్న వారి ఒత్తిడిని అధిగ మించి ముందుకు వెళ్దామని నిర్దేశించారు. ఇందు కోసం ఫిబ్రవరి 3, 4 తేదీల్లో పార్టీ ముఖ్యులతో జగన్ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఇక..జిల్లాల పర్యటనలు వెంటనే ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు. గతంలో తరహాలోనే పోరాట స్పూర్తితోనే ముందుకు వెళ్దామని నిర్దేశించారు. దీంతో, రానున్న రోజుల్లో వైసీపీ కేంద్రంగా చోటు చేసుకొనే పరిణామాలు.. జగన్ నిర్ణయాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications